Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గుతున్న కేసుల నమోదు
- టీబీ రోగులకు ఉచితంగా మందుల పంపిణీ
- గతేడాది 3,200కేసులు నమోదు
- నేడు ప్రపంచ నివారణా దినోత్సవం
నవతెలంగాణ-నల్లగొండటౌన్
క్షయవ్యాధి గురించి అందరికి తెలిసిందే. దాన్ని టీబీ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధీ మైక్రోబ్యాక్టీరియా (ట్యూబర్క్యూలోసిస్) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఈ వ్యాధిని రాబార్ట్కాక్ మొదటి సారిగా కనుగొన్నారు. ప్రతియేటా మార్చి 24న ప్రపంచక్షయవ్యాధి నివారణా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కాలుష్యం, రోగనిరోధకశక్తి లోపించడం వంటి కారణాలతో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధిని అరికట్టేందుకు గాను వైద్య ఆరోగ్యశాఖ, క్షయవ్యాధి నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ క్షయవ్యాది నివారణా దినోత్సవంపై ఈ వారం సండే స్పెషల్......
జిల్లాలో 2018 సంవత్సరంలో 3,200 క్షయవ్యాధి కేసులు నమోదైనట్టు క్షయవ్యాధి నివారణా విభాగం రికార్డులు చెబుతున్నాయి. వారందరికి జిల్లా టీబీ నియంత్రణ ఆధ్వర్యంలో కచ్చితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. క్రమం తప్పకుండా ఆరునెలలు మందులను వాడినట్టయితే వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 43 డీఎంసీ సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో ఉచితంగా తెమడ పరీక్షలను నిర్వహించడంతోపాటు మందులను కూడా పంపిణీ చేస్తున్నారు. 2016లో 31,59 కేసులు, 2017లో 3,665, కేసులు నమోదయ్యాయి. 2018లో 3,200 కేసులు నమోదయ్యాయి.
టీబీ లక్షణాలు
తెమడ, లేదా పొడిదగ్గుతోపాటు సాయంత్రం వేళలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి వస్తుంది. క్రమేణ బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం వంటివి సంభవిస్తాయి. రాత్రి సమయంలో చెమట పడుతుంది. ఈ లక్షణాలు కన్పించిన వారు వెంటనే వైద్యుని వద్దకు వెళ్లాలి. వ్యాధికి తగిన చికిత్స చేయించుకోకపోతే ప్రాణానికే ప్రమాదం. 18-39 ఏండ్ల వయస్సు ఉన్నవారికి ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది.
టీబీ ఎలా వ్యాపిస్తుంది..
అపరిశుభ్రమైన పరిసరాలు, కాలుష్యంతో వచ్చే అవకాశముంది. వ్యాధి ట్యూబర్ క్యూలోసిస్ అనే మైక్రోబ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇతరులకు ప్రబలే అవకాశముంది.
వ్యాధి నిర్ధారణ , చికిత్స
క్షయవ్యాధి నివారణకు మూడు రకాల పద్ధతుల ద్వారా చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో టీబీ యూనిట్లు, డీఎంసీల ద్వారా వ్యాధినిర్ధారణ, చికిత్స అందిస్తున్నారు. క్షయవ్యాధిగా నిర్ధారణ అయినవారికి వాటి ద్వారా ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. సకాలంలో గుర్తించి మందులను వాడితే 9నెలల్లోనే క్షయవ్యాధి పూర్తిగా నయమవుతుంది. 25 నుంచి 30కిలోల బరువు ఉన్న వారికి రోజుకు రెండు మాత్రలు, 40-54 కిలోల వారికి రోజుకు మూడు మాత్రలను, 55-69 కిలోల బరువు ఉన్నవారికి 4 మాత్రలను, 70కిలోలపైగా బరువు ఉన్నవారికి రోజుకు 5మాత్రలు వేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు.
వ్యాధి గ్రస్తులకు నెలకు రూ.500
క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీ క్షలు, మందులతోపాటు ప్రభుత్వం నెలకు రూ.500 అందజేస్తుంది. బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు బాధితులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నవారికి ఈ సహాయాన్ని అందజేస్తుంది. మొండికేసులు ఉన్నవారికోసం బెడిక్విలిన్ అనే నూతన డ్రగ్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అది క్రమం తప్పకుండా ఆరునెలలపాటు వాడితే వ్యాధి నయమయ్యే అవకాశముంది. డ్రగ్కు అయ్యే ఖర్చు సుమరు.రూ.5లక్షల-6లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది.
నేడు జిల్లాకేంద్రంలో ర్యాలీ
ప్రపంచ టీబీ నివారణా దినోత్సవం సందర్భంగా జిల్లా టీబీ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో నేడు జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నారు. క్లాక్టవర్ సెంటర్ నుండి డీఎంహెచ్ఓ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుంది. అనంతరం నిర్వహించే సమావేశానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ఉప్పల్, డీఎంహెచ్ఓ హాజరుకానున్నారు.
క్షయ నియంత్రణకు చర్యలు
డాక్టర్ కె.కల్యాణ్చక్రవర్తి
జిల్లాలో క్షయ వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వ్యాధిగ్రస్తుల వివరాలను సేకరించి పోషకాహారం కోసం వారి ఖాతాల్లో రూ.500 వేయడం జరుతున్నది. ప్రతి నెలా ఉచితంగా ఉచితంగా అన్ని రకాల మందులను అందజేస్తున్నాం. వ్యాధి నివారణ కోసం అవగాహనా కార్యక్రమాలు, ఉచిత వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నాం.