Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
విత్తనాభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన ఉంచాలని విత్తనాభివృధ్ధి సంస్థ చైర్మన్ కె.కోటేశ్వర్రావు కోరారు. గురువారం పట్టణ శివారులోని నందిపాడు విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి హరితహారం కార్యక్రమం నిర్వహించారు అనంతరం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నందిపాడు విత్తనాభివృద్ధి సంస్థలో 132 ఎకరాల భూమి ఉందని, దీనిలో చుట్టూ గ్రీనరీ పెంచాలని, మొక్కల పెంపకానికి కావాల్సిన వనరుల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సంస్థలో మంచి గుర్తింపు పొందిన విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు తయారు చేయాలని, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచుకోవాలని సూచించారు రాష్ట్రంలో తొమ్మిది విత్తన అభివృద్ధి యూనిట్లు ఉన్నాయని, వీటి ద్వారా లక్షా 5 వేల మంది రైతులు విత్తనాభివృద్ధి చేసి సుమారు ఐదు లక్షల క్వింటాళ్లు అందిస్తున్నారని తెలిపారు. ఇక్కడ తయారు చేసిన విత్తనాలు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. గతేడాది విత్తనాభివృద్ధి సంస్థ రూ.281 కోట్లు అమ్మకాలు చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది రూ.300 కోట్లకు పైగా విత్తనాలు అమ్మకాలు చేయనున్నట్టు తెలిపారు. విత్తనాభివృద్ధి సంస్థలో సిబ్బంది కొరతను నివారించేందుకు 20 మంది సీడ్ అధికారులను నియమించాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు.
మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ నందిపాడులో విత్తనాభివృద్ది సంస్థ చుట్టూ ప్రహారీగోడ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని, రైతును రారాజు చేసేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటి వరకూ 32.50 లక్షల మందికి రూ.3470 కోట్ల రైతుబంధు డబ్బులందించామన్నారు. అదే విధంగా 12,013 మంది చనిపోతే రూ.8 కోట్లు రైతుబీమా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ కేశవులు, జేడీఏ శ్రీధర్రెడ్డి, ఏడీఏ పోరెడ్డి నాగమణి, భాస్కర్, నర్సింహారెడ్డి, కోటిలింగం, భిక్షం, రైతుసమన్వయసమితి జిల్లా కన్వీనర్ రాంచంద్రనాయక్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మోసిన్అలీ, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.