Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుక అక్రమ రవాణా
- అడ్డుకున్న చోటే ఇసుక ఖాళీ చేసి ట్రాక్టర్ తీసుకెళ్లి వైనం
నవతెలంగాణ-మునుగోడు
ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన సమాచారంతో వీఆర్ఏలు బుధవారం రాత్రి ట్రాక్టర్ను పట్టుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ధర్పంతో ఇసుకను అక్కడే ఖాళీ చేసి ట్రాక్టర్ను తీసుకెళ్లారు. ఈ ఘటన బుధవారం రాత్రి మండలంలోని కిష్టాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం వీఆర్ఏలు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే... ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో వీఆర్ఏలు బుధవారం రాత్రి వెళ్లి ట్రాక్టర్ను పట్టుకున్నారు. అయితే ఆ ట్రాక్టర్ మాజీ సర్పంచ్కు చెందినది కావడంతో అధికార పార్టీ అండతో గ్రామ వీఆర్ఏలను లెక్క చేయకుండా ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్న చోటే ఖాళీ చేసి ట్రాక్టర్ను తీసుకెళ్లారు.దీంతో వీఆర్ఏలు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. కానిస్టేబుళ్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వీఆర్ఎలు
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను బుధవారం రాత్రి పట్టుకోగా కిష్టాపురం గ్రామానికి చెందిన ఆకుల లింగస్వామి వీఆర్ఏలు చెప్పినా వినకుండా దౌర్జన్యంగా ఇసుకను ఖాళీ చేసి ట్రాక్టర్ను తీసుకెళ్లాడని కిష్టాపురం వీఆర్ఏలు సింగనేణి భిక్షమయ్య, మహేశ్వరం శంకరయ్య, సింగనేణి అంజయ్య గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటాం: ఎస్సై
ఈ ఘటనపై మునుగోడు ఎస్సై శేఖర్ను వివరణ కోరగా క్రిష్ణాపురం వీఆర్ఏలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.