Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 5నెలల పెండింగ్ బిల్లులు 7నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు 6నెలలుగా బిల్లులు రాక అప్పులు చేసి వంటలు చేసి పెడుతున్నారన్నారు. ఇచ్చే అతితక్కువ రూ.వెయ్యి వేతనం 7నెలలుగా పెండింగ్లో ఉన్నదని అన్నారు. పాఠశాలలో వంటశాలలు లేక వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రక్షిత మంచినీరు నల్లా కనెక్షన్ లేని పాఠశాలలు నేటికీ ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరుకులు, కోడికుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని, కాటన్ యూనిఫాం, వంటపాత్రలు, సబ్సిడీ గ్యాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా కన్వీనర్ పోలె సత్యనారాయణ, బీమగాని గణేశ్, తిప్పర్తి, నల్లగొండ, మండల అధ్యక్షులు కిన్నెర సైదమ్మ, పాలకూరి అంజలి, సిరిసవాడ ఉమ, జగదాంబ, కొత్త యాదమ్మ, అనసూర్య పాల్గొన్నారు.