Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిట్యాల : పిల్లాయిపల్లి కాల్వ నీటి కోసం యాదాద్రి, నల్లగొండ జిల్లా ప్రజల మధ్య నీటి పంచాయతీ రోజు రోజుకి తీవ్రతరమవుతుంది. ఆదివారం భువనగిరి యాదాద్రి జిల్లా నుండి నల్లగొండ జిల్లాకు సుంకన్న పల్లి గ్రామం వద్ద పిల్లాయిపల్లి కాలువ ప్రవేశిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎల్లంకికి చెందిన రైతులకు చిట్యాల మండలానికి చెందిన సుంకన్న పెళ్లి, గుండ్రంపల్లి, వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగోని చెరువు గ్రామాల రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మండలానికి చెందిన రైతులకు సాగునీరు రావడంలేదని గుండ్రంపల్లి, సుంకన్న పల్లి, పిట్టంపల్లి, వెలిమినేడు, బొంగోనిచెరువు గ్రామాల రైతులు పిల్లాయిపల్లి కాలువ చిట్యాల మండలానికి ప్రవేశించే ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ కాల్వకు అడ్డంగా నీళ్లు రాకుండా మూసివేసి కింది గ్రామాలకు రాకుండా యాదాద్రి జిల్లా వాసులు అడ్డుకోవడంతో ఇరువర్గాలకు నీటి కోసం వాగ్వివాదం జరిగింది. పోలీసులు అదే ప్రాంతంలో ఉన్నప్పటికీ వారేమి స్పందించకుండా ఉండడంతో రైతులు నిశ్చేష్టులయ్యారు. తమ ప్రాంతానికి పూర్తిగా నీరు సరిపోయిన తర్వాతే కిందికి వదులుతానని యాదాద్రి జిల్లా ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు చెప్పడంతో రైతులు ఈ విషయాన్ని సంబంధిత ప్రజాప్రతినిధి చిరుమర్తి లింగయ్య దష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, రైతులు పాల్గొన్నారు.