Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ డాక్టర్ కొండల్రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
విషజ్వరాలు సోకితే ఆందోళన చెందొద్దని డీఎంహెచ్ఓ కొండల్రావు అన్నారు. బీఎల్ఎఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానికంగా డెంగ్యూ జ్వరాల నివారణ, జాగ్రత్తలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్లు వస్తున్నాయన్నారు. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు మంచం పడుతున్నారని, ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే త్వరగా నయం చేసుకోవచ్చన్నారు. ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయించి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందాలని సూచించారు. డెంగ్యూ నిర్ధారణ కేంద్రం జిల్లా మొత్తంలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఉందన్నారు. వైరల్ ఫీవర్లు, డెంగ్యూ జ్వరాలు వచ్చినపుడు పారాసిటమిల్ ట్యాబ్లెట్లు మాత్రమే వేసుకొని బలమైన ద్రవాహారాన్ని తీసుకుంటే వారం రోజుల్లో తగ్గిపోతుందన్నారు. ప్రయివేట్ ఆస్పత్రులకు వెళ్లినపుడు డెంగ్యూ పరీక్షలని చెప్పి తప్పుడు రిపోర్టులిస్తే అట్టి విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలన్నారు.అర్హత లేని వారు రక్తపరీక్షలు నిర్వహించినా, తప్పుడు రిపోర్టులి చ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామాజికసేవకుడు బత్తుల లక్ష్మారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ కేసా రవి, డాక్టర్లు పాల్గొన్నారు.