Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కట్టంగూర్
నాటి వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కళాకారులు తమ కళా రూపాలతో ప్రజల్లో చైతన్యం నింపాలని ప్రజా రంగస్థల ప్రయుక్త కె.శాంతారావు పిలుపునిచ్చారు. మండలంలోని ఇస్మాయిల్పల్లి గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి ప్రజానాట్యమండలి వీధి నాటకాల శిక్షణా తరగతులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళ కళ కోసం కాదు ప్రజల కోసమని ఉద్దేశంతో ప్రజానాట్యమండలి స్థాపించారన్నారు. నేడు పాలకులు అవలంబిస్తున్న విధానాల మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కళారూపాల ద్వారా చైతన్యపరిస్తూ, పోరాటాల వైపు ప్రజలను సమీకరిస్తోంది అని చెప్పారు. నేడు యువత విష సంస్కతితో పక్కదారి పడుతున్న తరుణంలో యువతను మంచి మార్గం వైపు నడిపించేందుకు కళారూపాలను తీసుకురావాలని సూచించారు. ఈనెల 25 నుండి 30వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి వీధి నాటకోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వేముల ఆనంద్, కట్ట నర్సింహ, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి శంకర్, నాయకులు వేల్పుల వెంకన్న, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, అమనగంటి అంజయ్య, నాగ సైదులు, ఉమా, విజయ, రాంబాబు, నర్సింహ పాల్గొన్నారు.