Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
నల్లమలలో యురేనియం తవ్వకాలపై స్థానికులు పోరాటానికి అండగా నిలిచారు. గతంలో జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేసి అడ్డుకున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా యురేనియం తవ్వకాలపై ప్రజలు సమరభేరి మోగించారు. నల్లమలలో యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాల విషయమై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నాయి. మూడ్రోజుల కింద అఖిలపక్ష సమావేశం హైదరాబాద్లో జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ చేపట్టపోతోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టు ఏర్పాటు విషయమై ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. యురేనియం ప్రాజెక్టుకు అవసరమైన ముడి యురేనియం నిక్షేపాలు బాసోనిబావితండాగుట్టలో యురేనియం నిల్వలున్నాయని యురేనియం కార్పొరేషన్ అప్పట్లో గుర్తించింది. రోజుకు 1250 టన్నుల యురేనియం నిక్షేపాలను వెలికితీసే అవకాశముంది.అయితే ఆ నిల్వలను వెలికితీసేందుకు రూ.507 కోట్లు ఖర్చవుతుందని యురేనియం కార్పొరేషన్ అప్పట్లో ప్రకటించింది.
యూసీఐఎల్ ప్రతిపాదన..
నల్లగొండ జిల్లాలో 1058 ఎకరాల భూమి, ఎల్లాపురం రిజర్వ్ ఫారెస్టు భూమి, మిగిలిన భూమిని ప్రాజెక్టుకు ప్రతిపాదించే గుట్టల పక్క గ్రామాల నుంచి సేకరించాలని ప్రతిపాదన చేశారు.యురేనియం శుద్ధి కర్మాగారం పీఏపల్లి మండలంలోని దుగ్యాల, ఎల్లాపురం గ్రామాల మధ్య నెలకొల్పాలని భావించారు. దీని కోసం 795 ఎకరాలు భూమి అవసరమని యూసీఐఎల్ ప్రతిపాదించింది. ఇందులో 632 ఎకరాల భూమిని గ్రామస్తుల నుంచి సేకరించాలని తీర్మానించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు :
యురేనియం నిక్షేపాలు వెలికితీసే గుట్టలు నాగర్జునసాగర్ రిజర్వాయర్కు 2.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. నిక్షేపాలు వెలికితీసే క్రమంలో వచ్చే దుమ్ము, ధూళి సాగర్ రిజర్వాయర్లోకి చేరే అవకాశముంది.ఇంకోవైపు యురేనియం శుద్ధి చేసిన వ్యర్థాలు కూడా సాగర్ రిజర్వాయర్లో కలుస్తోంది. దీంతో ఆనాడు ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు స్థానిక ప్రజలు ప్రాజెక్టును వ్యతిరేకించారు. యురేనియం ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2003 ఆగష్టు 19న నల్లగొండ జిల్లా పీఏపల్లి మండల కేంద్రంలో యురేనియం ప్రాజెక్టు షరతు విషయమై పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ఈ పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకించాయి. దీంతో యురేనియం ప్రాజెక్టు ప్రతిపాదన వెనక్కి వెళ్లింది. మళ్లీ 15 ఏండ్ల తర్వాత యురేనియం ప్రాజెక్టు తెర మీదకు వచ్చింది. మళ్లీ ఉద్యమాలు చెలరేగుతున్నాయి. ఈసారి ప్రాజెక్టు వెనక్కు వెళితే నల్లగొండ చరిత్ర పునరావృతమౌతోంది. నల్లగొండ ప్రజల నుంచే నల్లమల వాసులు ఆదర్శంగా తీసుకొని యురేనియం ప్రాజెక్టును అడ్డుకుంటారో..లేదో వేచి చూడాల్సిందే.