Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండిపతినిధి
ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా వైద్యం బృందం పనిచేస్తోంది. ప్రస్తుతం వస్తున్న సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడానికి వైద్యం బృందం అప్రమత్తంగా ఉండి రోగులకు వైద్యం అందిస్తోంది.రోజు రోజుకూ రోగుల సంఖ్య పెరిగి ఉద్యోగుల మీద పని ఒత్తిడి పెరిగినప్పటికీ..ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యులు పనిచేస్తున్నారు.సరిపడా స్టాఫ్ లేక పోవడంతో ఇటు వైద్య బృందం... అటూ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.ఏదిఏమైనా నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహ తెలిపారు. ఆదివారం ఆయన 'నవతెలంగాణ'తో ముఖాముఖిగా మాట్లాడారు.
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉందా..?
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. వ్యాధి లక్షణాలు ఉన్న రోగులకు టెస్టులు చేయిస్తున్నాం.ఈ వ్యాధి వచ్చిన వారికి రక్తకణాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.మందులకు తగ్గే అవకాశం లేని పక్షంలో రక్తకణాలు అందిస్తున్నాం.
సీజనల్ వ్యాధులకు సంబంధించిన వైద్యం అందుబాటులో ఉందా..?
ఆస్పత్రిలో సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉన్నాయి.మా దగ్గరకి వచ్చిన రోగులకు ప్లేట్లేట్స్ కౌంటింగ్ తగ్గాయని అనుమానమొస్తే ప్లేట్లేట్ కౌంటింగ్ చేయిస్తున్నాం.తగ్గినట్టు రిపోర్టు వస్తే రక్తకణాలు ఎక్కిస్తున్నాం.సాధ్యమైనంత వరకు ప్రభుత్వాస్పత్రిలోనే మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
రోగులకు సరిపడా బెడ్లు ఉన్నయా..?
పెరుగుతున్న రోగులకు సరిపడా బెడ్లు లేని మాట వాస్తవమే. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో రోగులు సంఖ్య బాగా పెరిగింది.రోజుకు 800నుంచి 900మంది రోగులు వస్తున్నారు.ప్రస్తుతం ఉన్న 250 బెడ్లు సరిపోవడం లేదు.పెరుగుతున్న రోగులకు అనుగుణంగా ఎదో ఒక రకంగా బెడ్లు అరెంజ్ చేసి వైద్యం అందిస్తున్నాం.మెడికల్ కాలేజీ ప్రారంభమైంది కాబట్టి బెడ్ల సంఖ్య పెంచే అవకాశం ఉంది.
సిబ్బంది కొరతను ఎలా భర్తీ చేస్తున్నారు..?
సిబ్బంది కొరత ఉండడంతో ప్రస్తుతం ఉన్న వైద్యుల మీద భారం పడకతప్పడం లేదు.ఉన్న సిబ్బందితో పనిచేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది.సిబ్బందిని పెంచాలి. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం.త్వరలో సరిపడా వైద్య సిబ్బంది కేటాయించడానికి ప్రభుత్వ సిద్ధంగా ఉంది.