Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నిరుపేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. నిత్యవసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరలకు అందజేయడం వల్ల పేదలకు మేలు జరిగేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ అంటే బియ్యమే అన్న మాదిరిగా మారిపోయింది. సబ్సిడీపై అందించే వస్తువులను ఒకొక్కటిగా తగ్గిస్తూ వస్తుంది. కేవలం అంత్యోదయ కార్డులకే చక్కెర, గ్యాస్ లేనివారికే కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లోని పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నకిరేకల్ మండలంలో 15342 తెల్లకార్డులు, 1079 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. గతంలో నకిరేకల్ మండలానికి 16430 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేసేవారు. ఆగస్టు, సెప్టెంబర్ నుండి కేవలం 3081లీటర్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకే చక్కెర అందడం వల్ల తెల్లకార్డు లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం లీటర్ కిరోసిన్ రూ.32 అందజేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో పామాయిల్, పప్పులు, చింతపండు, గోధుమలు, కారంపొడి, పసుపు వంటి సరుకులను నిలిపివేయడంతో నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు.
అమ్మహస్తం కనుమరుగేనా..?
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అమ్మహస్తం పేరుతో రేషన్ దుకాణాల నుండి 9రకాల వస్తువులను పేదలకు పంపిణీ చేసింది. బియ్యం, చక్కెర, చింతపండు, కారంపొడి, పామాయిల్, కందిపప్పు, పసుపు, ఉప్పు, గోదుమలను సరఫరా చేయడం వల్ల పేదలు క్రమం తప్పకుండా 9సరుకులను తెచ్చుకునే వారు. ప్రస్తుతం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ లబ్దిదారులకు చక్కెర, సిలిండర్ లేని వారికి కిరోసిన్ సరఫరా చేయడంతో రేషన్ అంటే బియ్యమే అన్నమాదిరిగా మారింది.
వేలిముద్రలతో ఇబ్బందులు
రేషన్ దుకాణాల్లో ఈపాస్యంత్రాల వల్ల డీలర్లు, లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు సరిపోక లబ్దిదారులు, యంత్రాల నెట్వర్క్ పనిచేయక డీలర్లు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. నిత్యం పేద ప్రజల జపం చేసే ప్రభుత్వం నిత్యవసర సరుకులను తగ్గించడంలో ఆంతర్యమేమిటని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఇబ్బంది లేకుండా చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.