Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షల పేరిట రోగుల జేబులకు చిల్లులు
-ల్యాబ్ల్లో కనిపించని పాతాలిజిస్టులు
-డెంగ్యూ కేసులను ప్రభుత్వాస్పత్రులకు రెఫర్ చేయాలని ఆదేశం
- ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలు
గ్రామాల్లోని జ్వరపీడితులు ప్రయివేట్ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు.డెంగ్యూ బాధితులకు ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయొద్దని ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేయాలని ఆదేశించినప్పటికీ పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. డెంగ్యూ ఫివర్ అని ప్రయివేట్ ఆస్పత్రి గడప తొక్కితే చాలు మీరు ఆస్పత్రిలో అడ్మిట్ కావాలంటూ లేకపోతే ప్లేట్లేట్స్ ఇంకా తగ్గిపోయి హైదరాబాద్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అక్కడి వైద్యులు బెదిరిస్తున్నారు.దీంతో నగదు కన్నా ప్రాణం ముఖ్యమని ప్రయివేట్ యాజమాన్యాలు చెప్పినట్టుగానే బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
దేవరకొండ పట్టణంలో 16 ప్రయివేట్ ఆస్పత్రులు, 20 డయాగస్టిక్ సెంటర్లు ఉన్నాయి.ఆయా ఆస్పత్రుల్లో వివిధ రకాల జబ్బులతో బాధపడివారితో కిక్కిరిసి పోతున్నాయి.ప్రయివేట్ నర్సింగ్హోమ్లు డయాగస్టిక్ సెంటర్లు కుమ్మక్కై ప్రజలను పీడిస్తున్నాయి.చిన్నపాటి జ్వరమొచ్చినా ఆస్పత్రికి వెళ్లగానే ప్లేట్లెట్స్ తగ్గి పోయాయని వివిధ రకాల పరీక్షలతో పాటు డెంగ్యూ పరీక్షలు చేయాలంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.ఇన్పేషెంట్గా చేర్పించుకుని రూ.వేలకు వేలు బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కొన్ని ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు డెంగ్యూ రోగులను చేర్చుకుంటూ డబ్బులను వెనకేసుకుంటున్నాయి.ఒకో రోజు సగటును రూ.5 వేలు మందులకు,పరీక్షలకే వినియోగిస్తున్నారు.డెంగ్యూ పాజిటివ్గా గుర్తించినా, అనుమానిత కేసులున్నా ప్రయివేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు జిల్లా అధికారి చెప్పారు.
ఫీజులు ఇలా...
జ్వరంతో ఆస్పత్రికి వెళ్లగానే ఓపీ ఫీజు రూ.150 చెల్లించాలి.మలేరియా, టైఫాయిడ్, రక్తపరీక్షలు,మూత్ర పరీక్షలు, డీసీ, టీసీ పరీక్షలకు రూ.1000 చొప్పున చెల్లిస్తున్నారు.అనంతరం రిపోర్టులు వచ్చాక ప్లేట్లేట్స్ సంఖ్య తగ్గాయంటూ మరోమారు రక్తపుపరీక్ష చేయిస్తున్నారు.వాస్తవంగా ప్లేట్లేట్స్ సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉంటేనే ప్రత్యేక వైద్యం చేయాల్సి ఉంది. పాజిటివ్గా రాకపోయినా ఆస్పత్రిలో చేరినప్పుడు ప్రతిరోజూ ప్లేట్లేట్స్ సంఖ్యను చూసి అదనపుచార్జీలు వసూలు చేస్తున్నారు.వీటితో పాటు ఖరీదైన మందులు రాస్తూ వారి ఆస్పత్రిలో ఉన్న మందులనే కొనుగోలుచేయాలని ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ల్యాబ్లలో కనిపించని పాథాలజిస్టులు
ప్రస్తుతం అన్ని ప్రయివేట్ ఆస్పత్రుల్లోనూ వైద్య పరీక్షలకు సంబంధించి ల్యాబ్రేటరీని నిర్వహిస్తున్నారు.దీని నిర్వాహణ బాధ్యతలు పరీక్షలను అర్హతలేని వారితోనే పరీక్షలు చేయిస్తున్నారు.గతంలో ఏదో ఒక చోట ల్యాబ్లో పని చేసిన కొద్దిపాటి అనుభవం ఉన్న వారే అధికంగా ఉన్నారు.రక్తనమూనా తీసి రక్తకణాల లెక్కింపు ఆధారంగానే రిపోర్టు తయారు చేస్తున్నారు.కానీ ఏ ఆస్పత్రిలోనూ పాథాలజిస్టులు లేరు.సాధారణ ల్యాబ్టెక్నిషీయన్లతోనే అన్ని పరీక్షలు కానిస్తున్నారు. డెంగ్యూకు సంబంధించి పాథాలజిస్టు మాత్రమే రక్తపు పరీక్ష నిర్వహించి రిపోర్టు జారీ చేయాల్సి ఉంది.కొన్ని మూత్రపరీక్షలకు కూడా పాథాలజిస్టు అవసరం ఉంటుంది.నాలుగు రోజుల కింద దేవరకొండ పట్టణంలోని ఆస్పత్రుల్లోని ల్యాబ్లలో తప్పుడు రిపోర్టులు ఇవ్వడం, అర్హత గల డాక్టర్లు, టెక్నిషీయన్లు లేకపోవడంతో నాలుగు ల్యాబ్లను డీఎంహెచ్ఓ కొండల్రావు సీజ్ చేశారు.
ఆందోళన వద్దు
డీఎంహెచ్ఓ-కొండల్రావు
డెంగ్యూ బారిన పడ్డ రోగులు ఆందోళన చెందవద్దని వైద్య అధికారులు సూచిస్తున్నారు.డెంగ్యూ లక్షణాలుగా అనుమానం వస్తే జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి రావాలి. డెంగ్యూ రోగుల కోసం ప్రత్యేక గది ఉంటుందని,యాంటిబయోటిక్ మాత్రలు వాడితే ప్లేట్లేట్స్ మరింత తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు.పారాసిటమల్ మాత్రలను తీసుకోవడంతో పాటు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.ప్రధానంగా బొప్పాయి, కివీ పండ్ల రసం తాగితే ప్రయోజనం ఉంటుంది.