Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోత్కూరు
ఓయూ పీహెచ్డీ విద్యార్థి నర్సయ్యది ఆత్మహత్య కాదని..ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ నేతలు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన ఓయూ విద్యార్థి, పీహెచ్డీ స్కాలర్ కొంపెల్లి నర్సయ్య సోమవారం యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సయ్య మృతదేహాన్ని సోమవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు చనిపోవడంతో నర్సయ్య తల్లిదండ్రులు మారయ్య, ఎల్లమ్మ రోధిస్తున్న తీరు అందర్నీ కలిచి వేసింది.
నర్సయ్య మృతదేహాన్ని మంగళవారం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే జోగు సంపత్ కుమార్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వి.హన్మంతరావు, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్లు సందర్శించి నివాళులర్పించారు. మృతుని తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. మృతుని కుటుంబానికి సంపత్కుమార్ రూ.50,000 వి.హన్మంతరావు రూ.20,000 ఆర్థిక సాయం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఓయూలో నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడున్నారని అన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. ఉద్యోగం రాలేదనే ఆవేదనతోనే నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. నర్సయ్య బలిదానాన్ని గుర్తించి పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. నర్సయ్యను కడసారి చూసేందుకు గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, స్నేహితులు, ఓయూ విద్యార్థులు భారీగా తరలివచ్చారు. గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, అన్నెపర్తి జ్ఞానసుందర్, స్థానిక సర్పంచ్ మరిపెల్లి యాదయ్య, డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, దీటి సందీప్, వంగాల సత్యనారాయణ, గుండగోని రామచంద్రు, పన్నాల శ్రీనివాస్రెడ్డి, కారుపోతుల వెంకన్న పాల్గొన్నారు.