Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
ఈ నెల 26నుంచి 29వరకు సూర్యాపేటలో నిర్వహించనున్న ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చలకూర రాంబాబు పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని తాడువాయి, వెంకట్రాంపురం గ్రామాల్లో మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ కళాకారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళారూపాల ద్వారా ప్రజా నాట్యమండలి వివిధ రకాల పదర్శనలు ఇస్తూ ప్రజలను చైతన్య పరుస్తుందని చెప్పారు. గ్రామీణ కళాకారులకు బస్సు, రైలు పాస్లు, పింఛన్లు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాల పురిగడ్డ సూర్యాపేటలో జరిగే మహాసభలను, 26న జరిగే బహిరంగ సభకు అన్ని గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అంతకు ముందు మహాసభల కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం మండల నాయకులు మనోజ్, సాగర్, పండు, రామాంజి, మహేష్, దుర్గయ్య పాల్గొన్నారు.