Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ-సూర్యాపేట
పెన్పహాడ్ మండల పరిధిలోని దుపహాడ్ గ్రామంలో ఫిబ్రవరి 25 ,26 తేదీలలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని ఆ సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన వ్యకాస జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దానిలో భాగంగానే ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాలలో నివసించే వ్యవసాయ కార్మికుల ఉపాధిహామీ చట్టానికి గత సంవత్సరం 71,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం కేవలం 61,500 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు వేలాది కోట్ల రూపాయలను రాయితీలుగా ఇచ్చిన ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీలకు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఉపాధి పనులు ప్రారంభించి కూలీలను ఆదుకోవాలని కోరారు. ఎస్సీ ,ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాలలో గ్రామాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు సోమ పంగ జానయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బచ్చలకూర రామ్ చరణ్, నల్లమేకల అంజయ్య, పోషణబోయిన హుస్సేన్ పాల్గొన్నారు.