Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ చరిత్ర, సంస్కతికి ఆది నుంచీ ఒక విశిష్టమైన, మహోజ్వలమైన చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచి, కుతుబ్షాహీలు, అసఫ్ జాహీలు, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లోనూ తెలంగాణ మట్టిగడ్డకు ప్రత్యేకమైన చైతన్యం ఉంది. అందులో విప్లవాల ఖిల్లా ఐన నల్లగొండకు మరింత గొప్పతనం ఉంది. ఈ గడ్డ నుంచే అనేక విప్లవాలు పుట్టుకొచ్చాయి. ఈ ప్రాంతం నుంచే ఎంతోమంది కవులు రచయితలు, సాహితీవేత్తలు, విప్లవకారులు, రాజకీయ నాయకులు ఇలా....ఎంతో మంది ఉద్దండులు ఉద్భవించారు. సాహిత్య రంగంలోనూ నాటి నుంచి నేటి వరకూ అక్షర సేద్యం చేస్తూ ప్రజా చైతన్యం గావిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో నల్లగొండ పట్టణానికి చెందిన రాపోలు జయకర్ ఒకరని చెప్పొచ్చు.
తెలంగాణ భాష, చరిత్ర, సంస్కతి, పండుగలు, పెండ్లిళ్లు, కులవత్తులు, కుటుంబ జీవన వ్యవస్థ, మానవ సంబంధాలు తదితర అంశాలతో తెలంగాణ బతుకు చిత్రాన్ని రాపోలు జయాకర్ తన దీర్ఘ కవిత 'తెలంగాణ జన జీవితం'లో కండ్లకు కట్టినట్టుగా రికార్డు చేశారు. ఆయన వచన కవిత్వం రాసినా, గేయ కవిత్వం రాసినా, దీర్ఘ కవిత రాసినా ఓ ప్రత్యేక శైలి అని చెప్పొచ్చు. తెలంగాణ జన జీవితం పుస్తకంలో తెలంగాణ స్థితిగతులను, ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని చక్కగా విశ్లేషించారు. ఈ దీర్ఘకవిత కావ్యంలోని పదాలు చదువుతుంటే ఎవరికి వారే తమ తమ జీవితాలకు అన్వయించుకునే పరిస్థితులోకి వెళ్లినట్టు అనిపించే అవకాశం కలుగుతుంది. ఇందులో మొదటి పేజీలోనే... ఒక మారుమూల పల్లెటూరు/ అది ఒక దీవిని పోలినట్టు ఉండు/ ఆ ఊరి చుట్టూ అతి పెద్ద వాగు/ వానాకాలం వచ్చిందంటే/ వారం పది రోజులు/ పొంగి ప్రవహించు...అంటూ ఈ దీర్ఘ కవిత ప్రారంభమవుతుంది. రచయిత తన ఊరు నర్సింగ్ బట్లను వర్ణించినప్పటికీ, తెలంగాణలోని వేలాది గ్రామాలను వర్ణించినట్టు ఉంటుంది. ''రోగాలు నొప్పులు వచ్చి/ ప్రాణం మీదికి ముంచు కొచ్చినా/ నీళ్లు బోసుకున్నామే నీళ్లాడలేక / ఊరు దాటి పోయే పరిస్థితి లేదు..అంటూ పల్లెల గురించి చిత్రించిన తీరు కనిపిస్తుంది. వెనుకటి కాలంలో సరైన రవాణా సౌకర్యాలు లేక, వైద్యం అందక పరిస్థితి ఎట్లుండెనో వివరించారు. అదేవిధంగా నిజాం పరిపాలన కాలంలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో, రజాకార్ల పైశాచిక ఆకృత్యాలు భరించలేక తెలంగాణ పల్లెటూళ్లు ''చెట్టుకొకరు పుట్టకొకరు, బతుకు జీవుడా అంటూ బతుకు వెళ్లదీసిన ప్రజల గురించి కొలుపు చెప్పినట్టు తెలియజేశారు. కోడి కూయంగ లేచి/ రేకల భారంగా/ చలన్నం సద్ది పెట్టుకొని/ నాలుగు ఆమెడలు ఉన్న/ నల్లగొండ అంగడి కని వెళ్లి/ అంబటాల కాగానే/ మోట బావి కాడ ఆగి/ సద్ది ముళ్ళను విప్పి/ ఇంపారదిని... అంటూ గ్రామాలలో వ్యవసాయం చేసే ప్రజల స్థితిగతులు, కరెంటు రాకముందు ఎలా ఉండేదో ఈ వర్ణన తెలియజేస్తది.
దాసరి ఎల్లయ్య/ దొరవారి గడియ ముందునుండి/ చెప్పులేసుకుని పోయిండని/ మస్కురాయన / దొర వారికి చెపితే/ ఊర్లో ఉప్పుగల్లు/ పుట్టకుండా చేసిండు అంటూ ఆనాడు దొరల పెత్తనం, ప్రజల జీవన విధానం వివరించారు. దొంగ పసురం / రంకు పెండ్లాం / సంక పిల్ల/ ఎట్ల చేదును ఈ ఎగసము.. వడ్ల పాపయ్య కాడికి పోయి నాగలికి మేడి పెట్టించి, కుమ్మరి నరసింహ కాడికి పోయి నాగలి కర్రుకు మొన పెట్టించి,.... సవుటపాసు, అల్ల పండేది గొట్టె పాస్, సావుకారికి ఇచ్చేది లొట్ట పీసు అంటూ ఆనాటి రైతుల పరిస్థితి గురించి పండిన పంట పరిస్థితుల గురించి హృదయ విదారకంగా ఉన్నది ఉన్నట్టుగా మన ముందు విశదీకరించారు. సార దుకాణం కాడికి పోయి, సంకలు కొట్టుకుంటూ బొట్టు వేసుకుని వంకరటింకర నడుచుకుంటూ ఒళ్లెరుగని తాగుడు తాగి, ఇల్లు చేరుకుంటే...ఇగురం దప్పినోడు, ఎంత చెప్పినా వినడు అనుకుంటూ చేసుకున్న పెండ్లాం ఏడ్చు కుంట కూర్చోబెట్టి ఏడ సొర కొంటడో అని సారెడంత సల్ల తాపీ సూరు కింద పండ పెట్టింది అని, భార్య భర్తల పరిస్థితులు వివరించారు.
అదే విధంగా ఆడపిల్ల పెండ్లి చేయడం ఎంత కష్టమో ఆ ఘోష కూడా రాసిండు. వెనుకటి రోజుల్లో పెండ్లి జరిగే విధానం గురించి, పెట్టు పోతలు గురించి చక్కగా చెప్పిండు. వినాయక పండుగ గురించి, బతుకమ్మ పండుగ, దసరా, సంక్రాంతి. దీపావళి మొదలైన పండుగలు తెలంగాణ పల్లెల్లో, పట్నాలలో జరిగిన తీరు గురించి పాట పాడినట్టుగా దృశ్యమానం చేసిండు. ఇంకా హోలీ పండుగ, పీర్ల పండుగ గురించి చక్కగా వివరించిండు. ఈ దీర్ఘకవిత చిన్న చిన్న పదాలతో ఆకాశమంత విస్తారంగా ప్రతి విషయాన్నీ రికార్డ్ చేయడం జరిగింది. తాను చూసినది, అనుభవించినది, పరిశీలించినది, అనుభూతి చెందినది, అధ్యయనం చేసినది ఇలా తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ కవితాధారగా కురిపించాడు. ఇందులోని శిల్పము, శైలి పరిశీలిస్తే రమ్యంగా ఉంటుంది. ఏ పేజీ చదివినా బాల్యంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తోంది. తెలంగాణ ప్రజల ఆర్తిని, ఆవేదనను, ఆప్యాయతను, ఆనందాన్ని, కష్టాలను, కన్నీళ్లను కలబోతగా తలపోసిన దీర్ఘ కవిత ఇది.
తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమ తీరుతెన్నులు, జరిగిన సంఘటనలు, పాల్గొన్న ప్రజల తీరు, నాయకుల పనితీరు ఇలా యావత్ తెలంగాణ చరిత్రను, జీవన విధానాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో చిత్రించినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా రాయడం గొప్ప విషయం. పుస్తకం చదువుతున్నప్పుడు మా భూమి, రంగుల కల సినిమాలు చూసినట్టుగా అనిపించడం జరుగుతుంది. పదము వెంట పదం, వాక్యం వెంట వాక్యం చదువుతుంటే 45 పేజీల పుస్తకం క్షణాల్లో అయిపోతుంది. ఇంత అయిపోయినంక నేను చదివింది ఇంత పెద్ద కవితనా అనుకుంటం. ఈ తెలంగాణ జన జీవితం అనే మహాకావ్యంలో ఎన్నో దృశ్యాలు కనుల విందు చేస్తాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని కండ్లముందు కట్టినట్టు అనిపిస్తుంది.
జయకర్ రాపోలు కవితా రీతిలో వస్తువు, శిల్పము, శైలి ఆత్మీయమైనవి. 30 ఏండ్ల నాటి స్థితిగతులను పుస్తకంలో వివరించారు. పల్లే, పట్నం తేడా లేకుండా యావత్ తెలంగాణ సంస్కతిని వ్యక్తపరిచాడు. పుస్తక రచయిత జయాకర్ గతంలోనే రెండు పుస్తకాలు వివరిం చిండు. ఇది మూడో పుస్తకం. నేటి తరానికి తెలియని తెలంగాణ బతుకు చిత్రం తెలంగాణ జన జీవితం పుస్తకం. ఈ దీర్ఘ కవిత చదవడ మంటే మన గురించి మనమే తెలుసు కోవడం అని ఒక రచయితగా, సమీక్షకుడి గానేను అర్థం చేసుకున్న. నేటి తరం విద్యార్థులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. రాబోయే రోజుల్లోనూ జయాకర్ ప్రజలను చైతన్యవంతం చేసే మరిన్ని పుస్తకాలు రాయాలని, తెలంగాణ జన జీవితం పుస్తకం రాసినందుకు మరొక్కమారు నా అభినందనలు.
- పుస్తక సమీక్షకులు.
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
కవి, రచయిత, ఉపాధ్యాయులు
జిల్లా నల్లగొండ.
సెల్ :9441561655.