Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గతేడాది చైనాలో కరోనా వెలుగు చూసిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మహమ్మారిపై చర్చ జరుగుతున్న తరుణంలో.. వూహాన్లో మెడిసిన్ చదువుతున్న ఓ విద్యార్థి జనవరి 25న స్వస్థలమైన భారత్లోని కేరళకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల తర్వాత గొంతు నొప్పి, జ్వరం లక్షణాలు కనిపించడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేరడు. జనవరి 30న సరిగ్గా ఆరు నెలల క్రితం దేశంలో నిర్ధారణ అయిన మొట్టమొదటి కోవిడ్-19 పాజిటివ్ కేసు ఇది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, భారత్లో నమోదైన మొదటి కేసును కలుపుకుని చైనాకు వెలుపల నమోదైనవి కేవలం ఒక శాతం కేసులు మాత్రమే. కేవలం రెండు నెలల్లోనే అత్యంత దారుణంగా ప్రభావితమైన ఇటలీ, యూకేలలో అప్పటికీ ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. అమెరికాలోనూ ఆ సమయంలో కేవలం ఐదు పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
అయితే, దేశంలో మొదటి కేసు నమోదైన సమయంలోనే వూహాన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు విద్యార్థులు సైతం కరోనా బారినపడ్డారని ఫిబ్రవరి 29న అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మార్చి నెలాఖరు నాటికి దేశంలో అనూహ్యంగా కరోనా సోకిన వారి సంఖ్య 1,326కు చేరింది. ఈ కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకల్లో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించింది. అయినప్పటికీ కోవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతూ ఏప్రిల్ చివరినాటికి 34,886 మంది కరోనా బారినపడ్డారు. మే 30 నాటికి 1,81,860 చేరుకున్నారు. ఈ క్రమంలోనే తన ప్రభావాన్ని అంతకంతకూ పెంచుకోవడంతో జూన్ నెలాఖరుకు 5,85,795 మంది వైరస్ బారినపడ్డారు. జులై నెలలో కరోనా వైరస్ తన విశ్వరూపం చూపించటంతో బాధితుల సంఖ్య 17,49,771కి పెరిగింది. మరణాల సంఖ్య సైతం 37,390కు పెరిగింది. దేశంలోని జిల్లాల వారీగా కరోనా వ్యాప్తి గమనిస్తే.. మొత్తం 739 జిల్లాల్లో ఏప్రిల్ నెలలో 443 జిల్లాల్లో కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. మే నెలలో 627 జిల్లాలు, జూన్లో 681 జిల్లాలకు కరోనా వ్యాపించింది. ఇక జూలై నెలలో ఏకంగా 700లకు పైగా జిల్లాలకు కోవిడ్-19 వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రపంచ దేశాల మొత్తం కేసుల్లో భారత్ పెరుగుదల వాటాను గమనిస్తే.. ఏప్రిల్లో 1.07 శాతం, మేలో 2.99 శాతం, జూన్లో 5.61 శాతంగా నమోదైంది. జులై చివరినాటికి రికార్డు స్థాయిలో దాదాపు 10 శాతానికి చేరింది.
దేశంలో మొదటి కేసు నమోదైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో భారత్ తన వాటాను అంతకంతకూ పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో నమోదైన మొత్తం కేసుల్లో 10 శాతం వాటాను భారత్ కలిగి ఉండటంతో పాటు నిత్యం నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 20 శాతం దేశంలోనే నమోదవుతున్నాయి. దేశంలో మొదటి కేసు వెలుగు చూసిన మొదట్లో కేరళలో ఎక్కువ కేసులు ఉన్నాయి. మార్చిలోనూ దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో అధికం కేరళలోనే ఉన్నాయి. అయితే, అక్కడి సర్కారు వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవడంతో కేరళలో తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీలలో కోవిడ్-19 తన ప్రభావం పెంచుకుంటూ వస్తున్నది. ఆరో నెలలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపించి కల్లోలం సృష్టిస్తూ.. యావత్ భారతావనినీ ఆందోళనకు గురిచేస్తున్నది. అయితే, కేంద్రం లాక్డౌన్ ప్రకటించినప్పటికీ.. మాటాల్లో చూపిన చొరవ.. ఆచరణలో చూపకపోవడం, లాక్డౌన్ అమలుకు పకడ్బంది చర్యలు తీసుకోకపోవడం, ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంతోనే దేశంలో కరోనా ప్రభావం గణనీయంగా పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సడలింపుల పేరుతో కరోనా సమూహ వ్యాప్తికి కారణమైన కేంద్రం.. యావత్ దేశ ప్రజానీకాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టిందని చెబుతున్నారు.