Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జీఎస్టీ వసూళ్లలో క్షీణత
-జులైలో రూ.87,422 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనానికి కరోనా తోడు కావడంతో వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు భారీగా క్షీణించాయి. ప్రస్తుత ఏడాది జూలైలో 14.36 శాతం తగ్గుదలతో రూ.87,422 కోట్ల వసూళ్లకు పరిమితమయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఈ గణంకాల ప్రకారం.. గతేడాది ఇదే నెలలో రూ.1.02 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. క్రితం జూన్ నెలలో రూ.90,917 కోట్ల వసూళ్లు జరిగాయి. గడిచిన జూలై స్థూల జిఎస్టి వసూళ్లలో సిజిఎస్టి కింద రూ.16,147 కోట్లు, ఎస్జిఎస్టి కింద రూ.21,418 కోట్లు, ఐజిఎస్టి రూ.42,592 కోట్లు, సెస్ రూ.7,265 కోట్ల చొప్పున నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 86 శాతంగా ఉంది. కాగా.. రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు 2020 సెప్టెంబర్ వరకు రిటర్నులను దాఖలు చేసేందుకు సడలింపు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా జులైలో వసూళ్లులో కొంత తగ్గడానికి కారణమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
82 శాతానికి ఆర్ధిక లోటు
కరోనా సంక్షోభంతో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం భారీగా తగ్గడంతో ఆర్థిక లోటు పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ పన్నుల్లో 32.6 శాతం మేర క్షీణించడంతో ఆర్ధిక లోటు భారీగా పెరిగింది. 1999 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది అత్యంత దారుణమైన ఆర్థిక లోటని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రాబడి తగ్గింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వార్షిక లక్ష్యంలో ఆర్థిక లోటు 83.2 శాతానికి చేరింది. జిఎస్టి వసూళ్లలో 53 శాతం తగ్గుదల చోటు చేసుకున్నట్లు ప్రభుత్వ గణంకాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం జిడిపి వద్ధి 40 శాతం మేర క్షీణించవచ్చని ఇప్పటికే కీలక ప్రయివేటు ఎజెన్సీలు అంచనా వేశాయి. జూన్ త్రైమాసికంలో కార్పోరేట్ ట్యాక్స్ రెవెన్యూ 23.2 శాతం తగ్గింది. ఉద్యోగాల కోత, వేతనాల కోత నేపథ్యంలో ఆదాయపు పన్ను వసూళ్లు 36 శాతం క్షీణించాయి. ఆదాయాలు తక్కువ నమోదు కావడంతో ఇది ఆర్థిక ఒత్తిడికి నిదర్శనమని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.