Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్(64) మృతిచెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొన్ని నెలలుగా సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతిచెందారు. పలు సంవత్సరాలుగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఈ ఏడాది మార్చిలో సింగపూర్లో చికిత్స అందిస్తున్నారు. 1956 జనవరి 27న ఉత్తర్ ప్రదేశ్లో జన్మించారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్లో క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన 1996, 2003లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, ఎస్పీ నేత ములాయం సింగ్తో వచ్చిన విబేధాల కారణంగా 2010లో పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఆయనను బహిష్కరిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకుంది. 2011లో సొంత పార్టీ రాష్ట్రీయ లోక్ మంచ్ (ఆర్ఎల్ఎం)ను నెలకొల్పారు. అయితే, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. ఉత్తరప్రదేశ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వానికి ములాయంసింగ్ మద్దతివ్వటంతో రాజ్యసభకు గెలుపొందారు. ఆయన మృతిపట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సమాజ్వాది పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తదితరులు సంతాపం ప్రకటించారు.