Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-హైదరాబాద్, పూణే, థానే, బెంగుళూరులో కరోనా ఉధృతిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యలు
- దేశంలో కొత్తగా 57,117 కరోనా కేసులు, 764 మరణాలు
- అక్టోబర్లో రష్యా కరోనా వ్యాక్సిన్ ?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, హైదరాబాద్ పూణే, థానే, బెంగుళూరు నగరాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నదనీ, ఆయా నగరాల్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. తాజాగా ఆయన వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య మంత్రులతో కరోనా పరిస్థితిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. దేశరాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ అక్కడ వేగంగా కోలుకుంటున్నారనీ, ప్రస్తుతం దేశంలోనే అధికంగా 89శాతం రికవరీ రేటుతో రాష్ట్రం ముందున్నదని అన్నారు. ఇప్పటివరకూ దేశంలోని యాక్టివ్ కేసుల్లో 0.28 శాతం కరోనా రోగులు వెంటిలేటర్లపై ఉండగా, 1.61శాతం ఐసీయూల్లో, 2.32 శాతం ఆక్సిజన్ సపోర్ట్ బెడ్లపై ఉన్నారన్నారు. దేశంలో రికవరీ రేటు 64.54 శాతానికి పెరిగిందనీ, కేసుల రెట్టింపు వ్యవధి 21 రోజులుగా ఉందన్నారు. అలాగే, 33.27 శాతం మంది రోగులు మాత్రమే వైద్య పర్యవేక్షణలో ఉన్నారనీ, ఇది మొత్తం పాజిటివ్ కేసుల్లో మూడో వంతేనని వివరించారు. మరణాల రేటు సైతం క్రమంగా తగ్గుతున్నదనీ, ప్రస్తుతం 2.18 శాతం మరణాల రేటుతో, భారత్ అంతర్జాతీయంగా అతితక్కువ మరణాల రేటు కల్గిన దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు.
తాజాగా రికార్డు స్థాయిలో 57,117 మందికి కరోనా
దేశంలో కరోనా బాధితులతో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 57,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్కరోజే ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఇదే సమయంలో వైరస్తో పోరాడుతూ 764 మంది మరణించారు. దీంతో దేశంలో కోవిడ్-19 మరణాల సంఖ్య 36,511కు పెరిగింది. కరోనా సోకిన వారి సంఖ్య 16,95,988కి చేరింది. ప్రస్తుతం 5,65,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 10,94,374 మంది కోలుకున్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1,93,58,659 కరోనా పరీక్షలు నిర్వహించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 5,25,689 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. కాగా, కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో టాప్-10లో మహారాష్ట్ర , తమిళనాడు (2,51,738), ఆంధ్రప్రదేశ్ (1,50,209), ఢిల్లీ (1,36,716), కర్నాటక (1,29,287), ఉత్తరప్రదేశ్ (89,086), పశ్చిమ బెంగాల్ (70,188), తెలంగాణ (64,786), గుజరాత్ (62,574), బీహార్ (51,233) రాష్ట్రాలు ఉన్నాయి.
కర్నాటక మంత్రికి కరోనా
కర్నాటకలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బిసి.పాటిల్కు కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, ఆయన భార్య, అల్లుడికి సైతం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా వచ్చింది. ప్రస్తుతం మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు హౌం క్వారంటైన్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో తాజాగా 5,172 పాజిటివ్ కేసుల నమోదుతోపాటు 98 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,412కు పెరుగగా, మొత్తం బాధితుల సంఖ్య 1,29,287 చేరింది.
ఢిల్లీలో యాక్టివ్ కేసులు 10 వేలు మాత్రమే !
దేశ రాజధాని ఢిల్లీని గత నాలుగు నెలలుగా ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు కాస్త శాంతించింది. నిత్యం నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పాటు రికవరీల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఇటీవలి వరకూ రోజుకు సుమారు 5వేల చొప్పున పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గత 24 గంటల వ్యవధిలో కేవలం 1,118 కొత్త కేసులు మత్రమే నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 1,36,716కు పెరిగింది. మొత్తం కేసులలో 1,22,131 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 10,596 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకూ ఢిల్లీలో 3,989 మంది ప్రాణాలు కోల్పోయారు.
యూపీలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ షురూ
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో కరోనా రోగులపై భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ''కోవాక్సిన్'' వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. గోరఖ్పూర్లోని రాణా హస్పిటల్ అండ్ ట్రౌమా సెంటర్లో ఈ క్లినికల్ ట్రయల్స్ను నిర్వహిస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. దేశంలో మొత్తం 12 సెంటర్లను కోవ్యాక్సిన్ ట్రయల్స్కు ఎంపిక చేశారు. ఆ సెంటర్లలో గోరఖ్పూర్కు చెందిన రాణా ఆస్పత్రి కూడా ఒకటి. మొత్తం 34 వ్యాక్సిన్లు రాణా ఆస్పత్రికి వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటికే కొంతమంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చామనీ, వారిని ఆస్పత్రిలో వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న వారంతా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గతంలోనూ రాణా హాస్పటల్ అండ్ ట్రౌమా సెంటర్లో టైఫాయిడ్, జపనీస్ ఎన్సిఫలిటిస్ వ్యాక్సిన్లకు హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించినట్టు సమాచారం.
30 సెకన్లలోనే కరోనా పరీక్షా ఫలితం !
కరోనా బాధితులను అత్యంత వేగంగా గుర్తించగల సరికొత్త పరీక్షల అభివృద్ధి దిశగా భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యక్తుల స్వరం, శ్వాస విశ్లేషణ వంటి సరికొత్త పరీక్షలు ఇందులో ఉన్నాయి. కేవలం 30 సెకన్లలోనే వ్యాధి నిర్ధారణ జరపడం వాటి ప్రత్యేకత. ఈ శీఘ్ర పరీక్షలను భారత రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ(డీఆర్డీవో), శాస్త్రీయ-పారిశ్రామిక పరిశోధక మండలి (సీఎస్ఐఆర్), భారత ప్రధాన శాస్త్రీయ సలహాదారు, ఇజ్రాయెల్కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి డైరెక్టరేట్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. అందులో ఒకటి స్వర విశ్లేషణ. ఈ రకమైన పరీక్షలో కరోనా బాధితుల స్వరంలో తేడాలను ఆర్టీఫీసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించి, వ్యాధి నిర్ధారణ జరుపుతుంది. మరో రకమైన పరీక్షలో వ్యక్తులు ఒక ట్యూబ్లోకి గాలిని ఊదాల్సి ఉంటుంది. టెరా-హెర్ట్జ్ తరంగాల ద్వారా అందులో వైరస్ నిర్ధారణ జరుగుతుంది. లాలాజల నమూనాలో కరోనాను గుర్తించే ఐసోథర్మల్ పరీక్ష, కొవిడ్-19కు సంబంధించిన ప్రొటీన్లను పాలీ అమైనో ఆమ్లాలతో గుర్తించే విధానం కూడా భారత్, ఇజ్రాయెల్ అభివృద్ధి చేస్తున్నవాటిలో ఉన్నాయి. ఈ నాలుగు వేగవంతమైన పరీక్షలను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మూడు రోజులుగా పరీక్షిస్తున్నారు.
అక్టోబర్లో రష్యా కరోనా వ్యాక్సిన్?
అక్టోబర్లోనే కరోనా వ్యాక్సిన్ను తీసుకురానున్నామనీ, తొలుత తమ దేశ ప్రజలందరికీ కరోనా టీకా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మికాయిల్ మురాష్కో ప్రకటించినట్టు ఆ దేశ స్థానిక మీడియా ఇటీవల ప్రచురించింది. ఆ దేశ ప్రభుత్వ సంస్థ అయిన ''గమేలేయా ఇనిస్టిట్యూట్'' రూపొందించిన కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన క్లీనికల్ ట్రయల్స్ పూర్తయ్యాయనీ, ప్రభుత్వం వద్ద ఈ వ్యాక్సిన్ను రిజిస్టర్ చేసే పనిలో ఉందని వార్తలో పేర్కొంది. తొలుత డాక్టర్లు, టీచర్లకు కరోనా టీకా ఇస్తారనీ, ఆక్టోబర్ నెలలో దేశ ప్రజలందరి కోసం భారీ కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్కు ఈ నెలలోనే ప్రభుత్వ అనుమతి లభించే అవకాశమున్నట్టు సమాచారం.