Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దేశ రాజధాని సమీపంలో ట్రక్కు డ్రైవర్పై వీరంగం
చండీగఢ్ : దేశ రాజధాని సమీపంలో గోరక్షకులు మరో అమానుష ఘటనకు పాల్పడ్డారు. గోమాంసం తరలిస్తున్నాడన్న అనుమానంతో గురుగ్రామ్లో ఓ ట్రక్కు డ్రైవర్పై విరుచుకుపడ్డారు. సుత్తితో బాదుతూ చిత్రహింసలకు గురిచేశారు. దాదాపు 25 మందికిపైగా మూకలు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాదాపు గంటన్నరపాటు ఆ వ్యక్తిని చిత్రహింసలకు గురిచేశారు. గురుగ్రామ్లోని బాదాషాపూర్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. స్థానిక పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం. గేదె మాంసం లోడ్తో గురుగ్రామ్లోని సదార్ బజార్కు లక్మన్ శుక్రవారం బయలుదేరాడు. విషయం తెలుసుకున్న గోరక్షకులు అతడిని వెంబడించారు. బాదాషాపూర్లో అతన్ని పట్టుకొని ట్రక్కు నుంచి కిందపడేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, తొలుత మాంసాన్ని ల్యాబ్కు పంపించే పనిలో పడ్డారే తప్ప.. బాధితుడిని రక్షించే ప్రయత్నం చేయలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. లక్ష్మన్ పరిస్థితిప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అతనికి తీవ్ర గాయాలుకావటమేకాదు, సుత్తితో కొట్టటంతో తలకు పలు ఫ్రాక్చర్లు అయినట్టు తెలుస్తున్నది. లక్మన్పై దాడి చేసిన దుండగుల ముఖం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఈ విషయం గురించి ట్రక్కు యజమాని మాట్లాడుతూ.. యాభై ఏండ్లుగా తాను మాంసాన్ని విక్రయిస్తున్నాననీ, తమ వాహనంలో ఉన్నది గేదె మాంసమని వివరణ ఇచ్చారు. లక్ష్మన్ ఏడాదిగా తమ మార్కెట్కు గేదె మాంసం సరఫరా చేస్తున్నాడని తెలిపారు.