Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ గాంధీ డిమాండ్
- ఆమె నిర్బంధాన్ని పొడిగించడం రాజ్యాంగ వ్యతిరేకం : చిదరబరం
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 370వ అధికరణం రద్దు చేసిన నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఎ) కింద ఆమెను అరెస్టు చేయగా.. దాని గడువు ఈనెల 5తో ముగియనుంది. కాగా గృహ నిర్బంధాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'దేశానికి చెందిన రాజకీయ నాయకులను అక్రమంగా నిర్బంధించినప్పుడే భారత ప్రజాస్వామ్యం దెబ్బతింది. ఇది మెహబూబా ముఫ్తీని విడుదల చేయాల్సిన సమయం' అని ట్వీట్ చేశారు. ఇదే విషయమై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వరుస ట్వీట్ల ద్వారా స్పందించారు. ముఫ్తీ నిర్బంధాన్ని మళ్లీ పొడిగించడం చట్ట విరుద్దమని పేర్కొన్నారు. ఆమె పార్టీ జెండా రంగు కారణంగా ముఫ్తీని నిర్బంధించామని కేంద్రం చెప్పడం హాస్యాస్పదమని తెలిపారు. 370 రద్దుపై ఆమె మాట్లాడ్డం తప్పా..? అని ప్రశ్నించారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం కాదా..? అని విమర్శించారు. ఒకవేళ తాను కూడా 370 రద్దు గురించి మాట్లాడితే అది ప్రజా భద్రతకు ముప్పు తీసుకొస్తుందా..? అని మోడీ సర్కారును నిలదీశారు.