Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దేశంలో మహమ్మారి విజృంభణ
- యూపీ సాంకేతిక విద్యాశాఖ మంత్రి మృతి
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్కు పాజిటివ్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర ఉగ్రరూపం దాలుస్తున్నది. కరోనా కేసులు, బాధితుల మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశంలో కొత్తగా దాదాపు 55వేల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. దీంతో భారత్లో కరోనా కేసుల సంఖ్య 17 లక్షల మార్కును దాటింది. అలాగే గత కొన్ని రోజులగా 700 వరకు నమోదవుతున్న కరోనా మరణాలు.. ఆది వారం రికార్డు స్థాయిలో 800 మార్కును దాటాయి. దీంతో మొత్తం మరణాలు 37వేల మార్కును దాటాయి. కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిం చిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఆదివారం 54,736 కేసులు నమోద య్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంక్య 17,50,724కుచేరింది. ఇందులో 5,67,730 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 51వేల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ అయినవారి సంఖ్య మొత్తం 11,45,630 కి చేరుకున్నది. ఇదిలా ఉండగా, గత మూడు రోజుల్లోనే దేశంలో 1.5 లక్షల కేసులు నమోదు కావడం విశేషం. ఇక కరోనా మరణాలూ తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. దేశంలో గత 24 గంటల్లోనే 853 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 37 వేల మార్కును దాటి 37,364గా రికార్డయ్యింది. కాగా, కరోనా మరణాలు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉన్నది. ఇక కరోనా కేసుల్లో మూడో స్థానంలో భారత్ ఉన్నది.
యూపీ మంత్రి కమలావరుణ్ కన్నుమూత
యూపీ మంత్రి కమలావరుణ్ (62) కరోనాతో ఆదివారం ఉదయం మృతి చెందారు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఆమె సాంకేతిక విద్యామంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు వెలుగుచూడటంతో ఆమె జులై 18న ఓ ఆస్పత్రిలో చేరారు. 'ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఒక్కసారిగా పరిస్థితి క్షీణించింది. వెంటిలేటర్లపై చికిత్స అందించాం. మా వైద్యులు ఆమెను కాపాడేందుకు శతధా ప్రయత్నించారు. కానీ... ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు' అని ఆస్పత్రి డైరెక్టర్ రాధాకష్ణ వెల్లడించారు.
ప్రముఖులపై కరోనా పంజా : దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు లాంటి వారిని ఎవరినీ వదలడం లేదు. తాజాగా, కరోనా మహమ్మారి కేంద్ర హౌం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకులు అమిత్ షాను, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్లను తాకింది. ఆదివారం చేసిన పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్గా తేలింది. తనకు కరోనా పాజిటివ్గా తేలిన విషయాన్ని అమిత్షా స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాఆరోగ్యం నిలకడగానే ఉన్నది. అయితే వైద్యుల సూచన మేరకు నేను ఆస్పత్రిలో చేరాను. గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారంతా ఐసోలేషన్లో ఉండాలి అంటూ అమిత్షా కోరారు. తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్కు ఆదివారం కోవిడ్ పాజిటివ్గా తేలింది. ఆయన చికిత్స చేయించుకున్న చెన్నైలోని కావేరీ ఆస్పత్రి ఈ మేరకు ట్వీట్ చేసింది. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్సింగ్కు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన హౌం క్వారంటైన్కు వెళ్లారు. ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి బయట పడ్డారు. తాజా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్గా తేలడంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.