Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏడాదిగా కాశ్మీరీలను వేధిస్తున్న సమస్య
- ఇంకా మెరుగుపడని సమాచార సదుపాయాలు
- ఆన్లైన్.. ఆఫ్లైన్ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం
- వరుస లాక్డౌన్లతో ఆగమవుతున్న లోయ
శ్రీనగర్ : ఇక్రా అహ్మద్ శ్రీనగర్కు చెందిన ఒక ఔత్సాహిక వ్యాపారస్తు రాలు. ఆన్లైన్ వేదికగా వ్యాపారం చేసే ఆమె.. సామాజిక మాధ్యమాలలో కస్టమర్ల అభిరుచి మేరకు వారికి వస్తువులు సరఫరా చేస్తుంటుంది. తన క్లైయింటు ఆన్లైన్లో ఒక డ్రెస్ ఆర్డర్ ఇస్తే.. అది ఆరునెలల తర్వాత సదరు వ్యక్తికి చేరింది. కాశ్మీర్లో ఇంటర్నెట్ గురించి వివరించడానికి ఇంతకుమించిన ఉదాహరణలు లేవేమో..! ఇంటర్నెట్ కనీస అవసరమైన ఈ రోజుల్లో.. ఏడాదిగా కాశ్మీరీలకు అది అందని ద్రాక్షే అయింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్కు ప్రత్యేకహౌదా కల్పించే 370వ అధికరణాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో.. కాశ్మీరీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సామాజికంగా, సాంస్కృతికంగానే గాక ఆర్థికంగా చితికిపోయింది సుందర కాశ్మీరీ లోయ. ఇక కాశ్మీర్లో అశాంతి, అల్లర్లు రేగుతాయనే ఆరోపణలతో సమాచార వ్యవస్థను కొద్దికాలం పాటు పూర్తిగా స్తంభింపజేసిన మోడీ సర్కారు.. ఇప్పటికీ అక్కడ హైస్పీడ్ ఇంటర్నెట్ను కల్పించడం లేదు. దీంతో ఆన్లైన్ వ్యాపారాలే గాక ఆఫ్లైన్ వ్యాపారస్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభణలో ఆస్పత్రులలో పరీక్షల రిపోర్టులు త్వరితగతిన రావడానికైనా 4జీ సేవలను పునరుద్దరించాలని కోరినా మోడీ సర్కారు మాత్రం వారిపై కనికరం చూపడం లేదు.
ఏడాదికాలంగా కాశ్మీర్లో 4జీ సేవలు లేక వ్యాపారాలు ఆగమవుతు న్నాయి. పలు హక్కుల కార్యకర్తలు, వ్యాపార ఏజెన్సీల నివేదికల ప్రకారం.. 370 రద్దు కారణంగా విధించిన షట్డౌన్, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పెట్టిన లాక్డౌన్తో అక్కడ సుమారు రూ. 40 వేల కోట్ల నష్టం వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక హైస్పీడ్ ఇంటర్నెట్ లేక సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ వేదికగా పనిచేసే ఔత్సాహిక వ్యాపారులు నష్టాల బారీన పడుతున్నారు. 28 ఏండ్ల ఇక్రా.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్లలో కస్టమర్లకు వారి అభిరుచి మేరకు ఆర్డర్లు సరఫరా చేసే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. 2015 నుంచి ఈ-వ్యాపారం చేస్తున్న ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులున్నారు. ఆకట్టుకునే దుస్తులు, వస్తువుల ఫోటోలు, వీడియోలను సోషల్మీడియాలలో పోస్టు చేయడం.. అవి కస్టమర్లకు నచ్చేలా ప్రమోట్ చేయడం ఇక్రా పని. అయితే హై క్వాలిటీ, మెమోరీ ఎక్కువగా ఉన్న ఫోటో, వీడియోలు పోస్టు చేయాలంటే దానికి 4 జీ ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ 2 జీ కారణంగా కనీసం తక్కువ మెమోరీ ఉన్న ఫోటో కూడా అప్లోడ్ అవడం లేదని ఆమె వాపోయింది. 4 జీ లేకపోవడంతో కస్టమర్లు కూడా ఆర్డర్లు ఇవ్వడం మానేశారని ఆమె తెలిపింది. గడిచిన ఏడాదిగా తన వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదే తరహా వ్యాపారం చేస్తున్న సదియా ముఫ్తీ కూడా 4 జీ బ్యాన్ వల్ల తాను నష్టాల పాలయ్యానని చెప్పింది. 'ఆన్లైన్ బొటిక్' వ్యాపారం చేస్తున్న ముఫ్తీకి దేశవ్యాప్తంగా కస్టమర్లున్నారని తెలిపింది. 'నా దగ్గర బ్రాడ్బ్యాండ్తో పాటు వైఫై ఉన్నా వాటితో ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆన్లైన్ వ్యాపారమనేది రెండు వైపుల నుంచి జరగాల్సిన ప్రక్రియ. కానీ ఇక్కడ 2 జీ నెట్వర్క్ కారణంగా నేను నా బొటిక్ను నిర్వహించడం కష్టంగా మారింది. ఆర్డర్లు ఇవ్వడం, తీసుకోవడం, చెల్లింపులు చేయడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి' అని వివరించింది. ఇంటర్నెట్పై నిషేధం విధించడం ఒక్క వ్యాపారనష్టమే కాదనీ, దాంతో తాము మానసికంగా కుంగిపోయి తీవ్ర ఒత్తిళ్లలోకి వెళ్తున్నామని ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేసింది.29 ఏండ్ల అమిర్ అబ్బాస్ 2017 అక్టోబర్లో ప్రజల ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను సరఫరా చేసే 'వ్యాలీ బాస్కెట్' అనే సూపర్ మార్కెట్ను నెలకొల్పాడు. కానీ రెండేండ్లు కాకముందే మోడీ సర్కారు చేపట్టిన చర్యల వల్ల అతడి బతుకు రోడ్డుపాలైంది. 'ఇది బాధాకరం. కానీ వాస్తవం. ఇకనుంచి వ్యాలీ బాస్కెట్ను నడిపించలేను. 4 జీ బ్యాన్తో నా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికీ నాకు రూ. 25 లక్షల దాకా అప్పులు మీద పడ్డాయి. ఆర్డర్లు లేక సరుకుల గడువు అయిపోయి అవీ పాడయ్యాయి' అని అబ్బాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పులను తీర్చడానికి అతడు ఇటీవలే కొరియర్ కంపెనీని ప్రారంభించినా.. లాక్డౌన్తో అదీ సరిగ్గా నడవడం లేదని తెలిపాడు.
కాశ్మీర్లో ఇంటర్నెట్పై నిషేధం విధించడం ఇదేం కొత్తకాదు. 2016లో హిజ్బుల్ ముహాజిద్దీన్ కమాండర్ బుర్హన్ వానీ ఎన్కౌంటర్ నేపథ్యంలో అక్కడ 133 రోజుల పాటు నెట్ను బ్యాన్ చేశారు. కానీ 370 రద్దు కారణంగా 2019 ఆగస్టు 5న కాశ్మీరీలు కోల్పోయిన సమాచార వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో పునురుద్దరించలేదు. కొద్దిరోజుల తర్వాత ఇంటర్నెట్ కల్పించినా.. అదీ 2 జీయే. దాంతో ఆర్థిక కార్యకలాపాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. తద్వారా ఆఫ్లైన్ వ్యాపారాలూ ఆగమవుతున్నాయని కాశ్మీరీ ట్రేడ్ వర్గాల నాయకులు ఆరోపిస్తున్నారు. పూల్వామాకు చెందిన హుస్సేన్ మాలిక్.. విదేశాల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ యంత్రాలను తెప్పించాడు. అవేమైనా సమస్య వస్తే వీడియో కాల్స్ ద్వారా పరిష్కారమి స్తామని సదరు సంస్థ అతడికి హామీ ఇచ్చింది. కానీ 2 జీతో చిన్న ఫోటోలు డౌన్లోడ్ చేయడం కష్టంగా ఉందనీ, వీడియో కాల్స్ ఎలా సాధ్యమని మాలిక్ ప్రశ్నించాడు. ఇక వస్తు సేవల పన్నులు (జీఎస్టీ) దాఖలు చేసే వ్యాపారులు సైతం ట్యాక్స్ రిటర్న్స్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలి పారు. హై స్పీడ్ ఇంటర్నెట్ లేక కాశ్మీరీలు నానా ఇబ్బందులు పడుతున్నా.. కరోనా కాలంలోనైనా 4 జీ సేవలు కల్పించాలని కోరినా మోడీ సర్కారు దీన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. వరుస లాక్డౌన్లతో జనజీవనం స్తంభించి ఆర్థికంగా లోయ చితికిపోతున్నా.. బీజేపీ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టైనా లేదని హక్కుల, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాశ్మీర్లో 4 జీ సేవలను పునరుద్దరించాలనే పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ నెల 7 న విచారణ జరగనున్న విషయం విదితమే.