Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా సోకిన రోగులకు ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి? వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చేరమనే కదా! ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు న్నాయి. ఏమాత్రం ఆందోళన చెందవద్దంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నుండి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నది ఇదే కదా! కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నుంచి వివిధ రాష్ట్రాల (కేరళ మినహా) ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం కరోనా చికిత్సకోసం కార్పొరేట్ ఆస్పత్రులకు క్యూలు కడుతున్నారు. ఈ పరిస్థితే ప్రభుత్వ ఆస్పత్రుల సంసిద్దతపై అనుమానాలను కలిగిస్తున్నాయి. అన్నీ బావుంటే మంత్రులు అక్కడికి ఎందుకు వెళ్లరన్న ప్రశ్నను ముందుకు తీసుకువస్తున్నాయి. ప్రధానమంత్రి నుండి కేంద్ర మంత్రులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఎయిమ్స్లోగానీ, సప్ధర్జంగ్ ఆస్పత్రిలోగానీ చికిత్స పొందడం సాంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. పైగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పరిధిలో నడిచే ఎయిమ్స్కు దేశంలోనే అత్యుత్తమ గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. పైగా కరోనా కోసం అత్యుత్తమ సౌకర్యాలతో ఈ ఆస్పత్రిలో 260 బెడ్లు ఏర్పాట్లు చేశారు. వీటిలో అనేక బెడ్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. కానీ, అమిత్షా ఎయిమ్స్కు వెళ్లడానికే సిద్ధపడలేదు పైగా ఢిల్లీ నుంచి పొరుగు రాష్ట్రమైన హర్యానాకు ప్రయాణం చేసి, గురుగావ్లోని వేదాంత కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. ఐదు నక్షత్రాల హోటల్ తరహాలో సౌకర్యాలను అందచేయడం ఈ ఆస్పత్రి ప్రత్యేకత. అమిత్షా ఈ అస్పత్రిలో చేరిన కాసేపటికే ఆయన వైద్య సేవలను పర్యవేక్షించడానికి ఎయిమ్స్ నుండి ఒక వైద్యుల బృందాన్ని నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమిత్షాకు షుగర్ వ్యాధి తీవ్రంగా ఉన్నందువల్ల ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. అమిత్షాకు కరోనా నిర్దారణైన రోజే తమిళనాడు గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ కూడా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. పరీక్షలను కావేరి ఆస్పత్రిలో చేసుకున్న ఆయన వైరస్ నిర్ధారణయైన తరువాత అపోలో ఆస్పత్రిలో చేరారు. తమిళనాడు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి పి. తంగమణి కూడా ఇదే ఆస్పత్రిలో చేరారు. మరో ఇద్దరు మంత్రులు కెపి అంబుల్గన్, సెల్వం కె రాజు చెన్నై నగరంలోని మరో కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. దేశంలో కరోనా బారిన పడిన మొదటి ముఖ్య మంత్రిగా గుర్తింపు పొందిన మధ్య ప్రదేశ్ సిఎం శివరాజ్సింగ్ చౌహాన్ భోపాల్లోని చిరయూ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరగా, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప బెంగళూరు నగరం లోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. మధ్యప్రదేశ్లో మరో ఇద్దరు మంత్రులు కూడా కార్పొరేట్ ఆస్పత్రులన ఆశ్రయించారు. తొలు త ప్రభుత్వ నిర్వహణలోని రాజీవ్గాంధీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిలోచేరిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆ తరువాత సాకేత్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి మారారు. మహారాష్ట్ర, పంజాబ్లలో కూడా కరోనా బారిన పడిన మంత్రులు కార్పొరేట్ ఆస్పత్రులనే ఆశ్రయించారు. తెలంగాణలో రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ ఆలీ అపొలోలో చికిత్స పొందడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.