Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్
తిరువనంతపురం : ఆరోగ్య కార్యకర్తల శిక్షణా రంగంలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ వెల్లడించారు. ఆరోగ్యకార్యకర్తలను ఇతర ప్రాంతాలకు పంపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 'ప్రజారోగ్య వ్యవస్థలో పెట్టుబడులు ఎంత కీలకమో ఈ మహమ్మారి సమయంలో అన్ని దేశాలకు అర్థమయిందనీ, అలాగే అది జాతీయ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా బలహీనపరుస్తున్నదని గుర్తించాయని' అని ఐజాక్ తెలిపారు. కేరళ నర్సులు, పారామెడికల్ సిబ్బంది కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. దేశంలో అత్యధిక అక్షరాస్యతా రేటు, ఇతర దేశాల్లో ఉన్న అత్యధికమంది కేరళీయులు సొంతరాష్ట్రానికి డబ్బు పంపించటంతో తమ రాష్ట్రానికి ఆర్థిక, సామాజిక లబ్ది చేకూర్చటంలో సహాయపడుతున్నాయన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు గత ఏడాది స్వదేశానికి పంపిన 80 బిలియన్ డాలర్లలో ఐదవ వంతు కేరళ రాష్ట్రానిదన్నారు. ఆరోగ్య కార్మికులకు శిక్షణారంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా రచన చేసిందన్నారు. మహమ్మారి అనంతర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు రాష్ట్రం అనేక కార్యక్రమాలను ఆవిష్కరించిందన్నారు. సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే సంస్థలకు రుణాలు, వడ్డీ రాయితీలు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. కేరళ మౌలికసదుపాయాల పెట్టుబడి నిధి బోర్డు ద్వారా రూ. 500 బిలియన్ల (6.7 బిలియన్ డాలర్లు) రుణం తీసుకుంటుందనీ, ఇందులో ఆరోగ్య వ్యయం వాటా అధికమని ఐజాక్ చెప్పారు.