Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే నిపుణులు స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. నిత్యం 3 నుంచి 5 లక్షల కొవిడ్ నిర్ధారణ పరీక్షలను చేపడుతోంది. గడిచిన 24 గంటల్లో 3.81 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,02,02,858 శాంపిళ్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్టు వెల్లడించింది. జులై 30న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 6,42,000 పరీక్షలు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు 1,348 ల్యాబ్లకు అనుమతినిచ్చింది. వీటిలో 914 ప్రభుత్వ ల్యాబ్లు ఉండగా మరో 434 ప్రైవేటు ల్యాబ్లు ఉన్నాయి. కరోనా నిర్ధారణ కోసం ఈ ల్యాబ్లలో ప్రస్తుతం ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, సిబినాట్ విధానాలను అనుసరిస్తున్నారు. జనవరి నెలలో దేశంలో ఒకే ఒక్క కరోనా నిర్దారణ కేంద్రం ఉండగా ప్రస్తుతం 1,348లకు పైగా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షలను భారీగా నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచారు.
5 నుంచి యోగా.. జిమ్ షురూ
అన్లాక్ మూడో ఫేస్లో భాగంగా జిమ్ ఇనిస్టిట్యూట్లు, యోగా సెంటర్లను తెరవడానికి కేంద్ర సర్కార్ గ్రీన్ సిగల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 5 నుంచి వీటిని తిరిగి తెరిచేలా కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, కరోనా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం తెరిచేందుకు అనుమతిలేదు. 65 ఏండ్లు పైబడిన వారు, ఏవైనా రోగాలతో బాధపడుతున్న వారు, గర్భిణీలు, 10 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం జిమ్, యోగా సెంటర్లకు వెళ్లేందుకు అనుమతిలేదు. అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడకుండా కఠినచర్యలు తీసుకోవాలని సూచించింది. బ్యాచ్కు బ్యాక్కు మధ్య 15 నుంచి 30 నిమిషాల గ్యాప్ ఉండేలా చూడాలని సూచించింది. ఆక్సిజన్ సాట్యురేషన్ లెవల్ 95శాతం కంటే తక్కువగా ఉన్న వారిని ఎక్సర్సైజ్లు చేయడానికి నిరాకరించాలని స్పష్టం చేసింది. 'వ్యక్తిగత దూరం, మాస్కు, జిమ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించింది.
ఎంపీ కార్తీ చిదంబరంకూ...
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం కరోనా బారిన పడ్డారు. 'నాకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.
వైరస్కు సంబంధించిన సాధారణ లక్షణాలు ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు హౌం క్వారంటైన్లో ఉన్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారంతా వైద్యులు ఇచ్చే కరోనా సూచనలు పాటించాలని కోరుతున్నా'అని ట్విటర్లో పేర్కొన్నారు.
సెల్ఫ్ క్వారంటైన్లో మంత్రి రవి శంకర్ ప్రసాద్
కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కేంద్ర హౌం మంత్రి అమిత్ షాకు ఆదివారం కరోనా పాజిటివ్గా నిర్థారణ కాగా, ఆయనను రవిశంకర్ ప్రసాద్ శనివారం కలిశారు. ఈ నేపథ్యంలో రవి శంకర్ ప్రసాద్ ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నారు.
ధారవి మోడల్ను అనుసరించాలి : ప్రముఖ అంటువ్యాధి నిపుణులు గిరిధర బాబు
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా కట్టడికి నగరాలు ధారవి మోడల్ను అనుకరించాలని ప్రముఖ అంటువ్యాధి నిపుణులు డాక్టర్ గిరిధర బాబు అన్నారు. అక్కడ తీసుకున్న చర్యలతో ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ఉన్న ధారవిలో మహమ్మారిని కట్టడిచేశారని తెలిపారు.
ఇందుకు గానూ అక్కడ బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తీసుకున్న చర్యలు అభినందనీయమని అన్నారు. పటిష్టమైన చర్యలతోనే ధారవి, ఢిల్లీ నగరాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన వివరించారు.