Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ : తెలుగురాష్ట్రాల్లో తన గానంతో పాటు ఆటతో అలరించిన విప్లవ గాయకుడు, కవి వంగపండు ప్రసాదరావు మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. శనివారం రాత్రి భోజనం చేసి కుటుంబసభ్యులతో మాట్లాడి నిద్రించిన ప్రసాదరావు ఉదయం బిగుసుపోయి ఉండడం చూసి కంగారు పడి కుటుంబ సభ్యులు కదిలించబోయారు. అప్పటికే నిద్రలోనే ఆయన చనిపోయినట్టు గుర్తించారు. వంగపండు మరణం సాంస్కృతిక రంగానికి తీరనిలోటేనని సాహితీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో 1944లో జన్మించిన వంగపండు, వివాహం అనంతరం అదే మండలంలోని వీరభధ్రపురంలో నివాసం ఏర్పర్చుకున్నారు. పదో తరగతి చదివిన అనంతరం ఐటీటీ చేసి, ఉద్యోగ వేటలో విశాఖ చేరుకొని అక్కడ పోర్టులో చిరుఉద్యోగిగా మారారు. అప్పటికే చిన్నచిన్న పల్లెపదాలతో, జానపద శైలిలో పాటలు రాయడం ప్రారంభించిన ఆయనకు విశాఖలోని సీపీఐ(ఎం) నాయకులతో ఏర్పడిన పరిచయాలతో విశాఖ ఉక్కు ఉద్యమంలో రాసి, స్వయంగా పాటలు పాడడంతో పాటు ప్రదర్శనలు ఇవ్వడం వల్ల మంచి గుర్తింపు లభించింది. ప్రముఖ రచయితలు కవులు, రావిశాస్త్రి, శ్రీశ్రీ వంటి వారి సూచనలతో తన పాటలకు పదును పెట్టి జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లగా మంచి ప్రాచుర్యం పొందాయి. రైతుకూలీలు, కార్మికుల కష్టాలతో పాటు దళిత, పీడిత ప్రజల సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని వందలకు పైగా పాటలు రచించారు. అప్పట్లో కరణం, మునసబు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, పోరాటనాయకుల పట్ల ప్రభుత్వ వైఖరి, పోలీసుల దాష్టీకాలను ఎండగడుతూ రాసిన 'భూ బాగోతం' ఎంతో ప్రజాదరణ పొంది ఎనలేని పేరును తీసుకొచ్చింది. ఆంధ్రరాష్ట్రంలోని మూరుమూల గ్రామాల్లో వేలాది కళాబృందాలు లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ భూబాగోతం ఇతివృత్తాన్ని స్ఫూర్తిగా తీసుకుని కరణం, మునసబు, తెలంగాణాలో పటేల్, పట్వారీ వ్యవస్థలను నిషేధించడానికి ఒక కారణమైందని చెపుతుంటారు. ఆ తర్వాత క్రమంలో శ్రీశ్రీ, గద్దర్, బి.నర్సింగ్రావులతో కలిసి జననాట్యమండలి స్థాపించి వందలాది ప్రదర్శనల ఏర్పాటుకు కారణమయ్యారు. అనంతరం సినీరంగంలో మాదాల రంగారావు, టి.కృష్ణ, ఆర్.నారాయణమూర్తి వంటివారు ఈయనచే సినిమాలకు పాటలు రాయించారు. జజ్జనకరి జనారే, ఏంపిల్లో ఎల్దామొస్తవా, యంత్రమెట్టాకదులుతున్నదంటే వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతున్నాయి. విప్లవకళాకారుడుగా తన కృషిని కొనసాగించిన ఈయన ఆ బాటలో కొద్దిగా సడలి ప్రజాసమస్యలపై తనదైన బాణీలతో పాటలను రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత దబేల్దుబేల్ కళారూపకం, తూర్పుబాగోతం, ఒగ్గుకథ వంటివాటి ద్వారా ప్రజలకు బాగా చేరువయ్యారు. అతని కృషికి ఆంధ్రాయూనివర్సిటీ గౌరవ ప్రొఫెసర్గా నియమించి గౌరవించారు. 77ఏండ్ల వంగపండు ప్రసాదరావుకు తాను చనిపోయే రోజు వరకూ ప్రజలు ఎదుర్కొంట్ను సమస్యలపై పాటలు కట్టి వాటిద్వారా వారిని చైతన్యపర్చడానికి కృషి చేశారు. 15ఏండ్ల క్రితం విశాఖను వదిలి పార్వతీపురలో నివాసం ఏర్పర్చుకొని జీవనం కొనసాగిస్తున్న వంగపండుకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె వంగపండు ఉషా ఇటీవల ఏపీ రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మెన్గా ప్రభుత్వం నియమించింది.
పలువురు సంతాపం :
వంగపండు ప్రసాదరావు మృతికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలకు ఆదేశించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు తమ సంతాపాన్ని తెలిపారు.