Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మత సంబంధిత కార్యక్రమాల్లో ప్రధాని నేరుగా పాల్గొనడమేంటీ? : ఏచూరి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
అన్లాక్ ప్రక్రియ మొదలైనా మోడీ సర్కారు చర్యలు ఏమాత్రం ఆశాజనంగా లేవని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వ చర్యలు నిరాశాజనకంగానే ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిణామాలపై ఏచూరి ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. అసలు మత సంబంధిత కార్యక్రమాలు చేపట్టొద్దని ఒక పక్క కేంద్ర హౌంశాఖ మార్గదర్శకాలు ఇస్తున్నదనీ, కానీ ప్రధాని మాత్రం అయోధ్య ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మితమయ్యే రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావటమేంటని ప్రశ్నించారు. మోడీ సర్కారు ద్వంద్వ వైఖరిని సీపీఐ(ఎం) ఖండిస్తున్నట్టు చెప్పారు. యావత్ మానవాళికి సవాలుగా ఉద్భవించిన కరోనా మహమ్మారి ప్రపంచ స్థితిగతులను మార్చి వేసిందని ఏచూరి చెప్పారు. కోవిడ్ కంటే ముందు ఉన్న ప్రపంచాన్ని మనం ఎంతమాత్రం ఊహించుకోలేమనీ, కానీ అదే పూర్వ స్థితికి మనమంతా రావాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఈ అంటువ్యాధికి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ప్రపంచమంతా మళ్ళీ పూర్వ స్థితికి వచ్చే అవకాశం ఇప్పట్లో లేదని అభిప్రాయపడ్డారు. నయా ఉదారవాదం, ప్రపంచీకరణ విధానాల కారణంగా ప్రజారోగ్యాన్ని, ప్రభుత్వ వైద్య వ్యవస్థను పెట్టుబడిదారీ దేశాలు ధ్వంసం చేశాయన్నారు. 90వ దశకం తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు క్రమంగా ప్రజా వైద్యాన్ని భ్రష్టు పట్టించారన్నారు. దీంతో ఎక్కువగా ఇన్సూరెన్స్, ఫార్మాల కంపెనీల దోపిడీకి అవకాశం దొరికినట్టయిందన్నారు. ప్రజారోగ్యం స్థానే... సామాన్య ప్రజానీకం, పేదలు భరించలేని ప్రయివేటు వైద్యం తీసుకొచ్చారని అన్నారు. ఈ చర్యలవల్లనే ఇప్పుడు కరోనాను ఎదుర్కొవడంలో పెట్టుబడిదారీ దేశాలు విఫలమైనట్టు వివరించారు. అయితే, ఇదే కరోనా అంటువ్యాధిని కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలుగా పేరొందిన క్యుబా, వియత్నం, చైనా, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ వైద్య వ్యవస్థలో చేసిన పటిష్ట చర్యల కారణంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నాయన్నారు. మోడీ ప్రభుత్వం అవలంభించిన అలసత్వపూరిత చర్యల కారణంగా భారత పరిస్థితి ప్రస్తుతం మరింత ఇబ్బందికరంగా తయారైందన్నారు. చైనాలో తొలి కేసు 2019 డిసెంబర్లోనే నమోదు అయిందనీ, కానీ మోడీ సర్కారు మాత్రం అందుకు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. అందుకు విరుద్ధంగా, ఢిల్లీలో తబ్లిగీ సమావేశానికి అనుమతి ఇవ్వడం, మధ్యప్రదేశ్లో ప్రభుత్వం పడగొట్టడం, పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, తన కీర్తి కోసం నమస్తే ట్రంప్ చేపట్టడంలో ప్రధాని మోడీ బీజీగా గడపడాన్ని ఏచూరి తప్పుబట్టారు. అయితే, కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అదే నెలలో సంబంధిత అధికార యంత్రాంగంతో సమావేశాలు నిర్వహించి కట్టడికి చర్యలు తీసుకున్న విధానాన్ని కొనియాడారు. కేవలం నాలుగు గంటల సమయమిచ్చి, దేశమంతా లాక్డౌన్ విధిస్తున్నామని చెప్పడం నిజంగా హాస్యాస్పదమన్నారు. వలస కార్మికుల వ్యథ, ఆకలి చావులు దేశమంతా చూసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోకుంటే, ఈ దుస్థితిని చాలావరకు నిర్మూలించగలిగేవారమనీ సీతారాం ఏచూరి చెప్పారు. కరోనా కట్టడికి అగ్రభాగాన ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు ఇవ్వని పరిస్థితి ఇంకా ఉందన్నారు. వారికి సరైన విధంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.