Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టైన ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబుకస్టడీని ఈ నెల 7 వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆయన ప్రమేయముందన్న ఆరోపణలపై ఢిల్లీ యూనివర్శిటీలోని ఇంగ్లీష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న హనీబాబును..గత వారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) అరెస్టు చేసిన సంగతి విదితమే. సిపిఐ(మావోయిస్టు)లతో ఆయనకు సంబంధాలున్నాయని ఎన్ఐఎ ఆరోపించింది. విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. ఆగస్టు 4 వరకు ఎన్ఐఎ కస్టడీకి అప్పగించింది. మంగళవారంతో కస్టడీ ముగియడంతో కోర్టు ఎదుట హనీబాబును హాజరుపర్చింది. ఆయన ఈమెయిల్ ఖాతా నుండి 1.26 లక్షల మెయిల్స్ను రికవరీ చేశామని,వాటిని పరిశీలించాలని ఎన్ఐఎ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇతర నిందితులతో, సిపిఐ మావోయిస్టు సానుభూతి పరులతో తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా సంబంధాలను నెరుపుతున్నారని దర్యాప్తులో వెల్లడైందని, మరింత విచారణ చేపట్టాలని కోర్టుకు ఎన్ఐఎ తెలిపింది . దీంతో ఈ నెల 7 వరకు హనీబాబు కస్టడీని కోర్టు పొడిగించింది.