Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రాష్ట్ర, కేంద్ర, స్థానిక ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఒంటరిగా నివసిస్తున్న లేదా క్వారెంటైన్లో ఉంటున్న వృద్ధులకు సంరక్షణ, మద్దతు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర, స్థానిక యంత్రాంగాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వృద్ధులు ఒంటరితనానికి లోనై, ఒత్తిడి గురౌతున్నారని సీనియర్ న్యాయవాది అశ్వనీ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేపట్టిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం... వృద్ధులు ఆర్థిక సమస్యలతో బాధపడకుండా..వారి అవసరాలను తీర్చేవిధంగా ప్రభుత్వాలుండాలని పేర్కొంది. అదేవిధంగా ఒంటరిగా, క్వారెంటైన్లో ఉంటున్న వృద్ధులకు అవసరమైన వస్తువులు, సేవలను సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపింది. సహాయం అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేసింది. వృద్ధులు, ముఖ్యంగా ఒంటరిగా నివసిస్తున్న వారు..ఏదైనా అభ్యర్థన చేస్తే తక్షణమే స్పందించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, వృద్ధాశ్రమంలో సేవలందిస్తున్న సంరక్షకులు వ్యక్తిగత పరిరక్షణ పరికరాలను ధరించాలని, సరైన పారిశుధ్య విధానాలను అనుసరించాలని ఆదేశించింది.
అలాగే, వృద్ధులు పెన్షన్లను సకాలంలో పొందేందుకు సహకరించాలని కోర్టు పేర్కొంది. అయితే ఆసుపత్రి చార్జీలపై వారికేమన్నా పరిమితి విధించారా అనే పిటీషనర్ ప్రశ్నకు వివరణ నివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది.