Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మూడు కోవిడ్-19 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్లో వివిధ దశల్లో ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్, జైడస్ కాడిలాకు చెందిన డీఎన్ఏ వ్యాక్సిన్ మొదటి దశ (ఫస్ట్ ఫేజ్) పూర్తి చేసుకున్నాయి. రెండో దశ ప్రారంభం కానుంది. మూడవది ఆక్స్ఫోర్డ్ వ్యాక్సిన్' అని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆక్స్ఫోర్ట్ వ్యాక్సిన్ను పూణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు రెండు, మూడు దశల క్లినికల్ ట్రయిల్స్కు అనుమతి లభించిందని చెప్పారు. 17 ప్రాంతాల్లో వారం రోజుల్లో ఈ ట్రయిల్స్ ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరిచడం, చేతులను శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు అన్నింటికంటే ఉత్తమమైన వ్యాక్సిన్ అని డాక్టర్ బలరామ్ భార్గవ పేర్కొన్నారు. ప్రస్తుతమే కాకుండా, భవిష్యత్తులో కూడా ఈ జాగ్రత్తలు కీలకమని ఆయన చెప్పారు.
సన్ ఫార్మా నుంచి కరోనాకు మాత్ర
ట్యాబ్లెట్ ధర రూ.35
ముంబయి : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ సన్ ఫార్మా కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి ఫావిపివరవిర్ డ్రగ్ 'ఫ్లూగార్డ్'ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. 200 మిల్లీ గ్రాముల ఈ మాత్ర ధరను రూ.35గా నిర్ణయించినట్టు మంగళవారం వెల్లడించింది. తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి లక్షణాలున్న కరోనా రోగుల చికిత్స కోసం దేశంలో ఆమోదించిన ఏకైక నోటి యాంటీ-వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ అని తెలిపింది. అతి తక్కువ ధరలో ఎక్కువమంది రోగులకు తమ మందును అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫ్లూగార్డ్ను అవిష్కరించామని సన్ ఫార్మా ఇండియా బిజినెస్ సీఈఓ కీర్తి గానోర్కర్ తెలిపారు. ఈ వారంలోనే ఫ్లూగార్డ్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందన్నారు.
సిద్ధరామయ్యకు పాజిటివ్
కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కరోనా బారిన పడగా.. ఇప్పుడు ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు కూడా వైరస్ సోకింది. తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్టు ఆయన ట్వీట్ చేశారు. గత వారం రోజులుగా తనతో కాంటాక్టు అయిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలనీ, హౌం క్వారంటైన్లో ఉండాలని కోరారు. మరోవైపు వైరస్ బారిన పడిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు తెలిపారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కూ..
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన చికిత్స నిమిత్తం గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కేంద్రంలో పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర హౌం మంత్రి అమిత్షాకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత...Click here