Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య సేవలను కల్పించండి
- జాతీయ మహిళా సంఘాల డిమాండ్
- 28న దేశ వ్యాప్త నిరసనలకు పిలుపు
న్యూఢిల్లీ : తిండిగింజలు ఇవ్వడంతోపాటు ఉపాధి, ఆరోగ్య సేవలు కల్పించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మోడీ సర్కార్ను డిమాండ్ చేస్తూ ఈ నెల 28న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని జాతీయ మహిళా సంఘాలు పిలుపునిచ్చాయి. గత నెల 29, 30 తేదీల్లో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యు), ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమన్స్ అసోసియేషన్ (ఎఐపిడబ్ల్యుఎ) అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘటన్ (పిఎంఎస్), ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి (ఎఐఎఎంఎస్), ఆల్ ఇండియా మహిళా సంస్కృతిక్ సంఘటన్ (ఎఐఎంఎస్ఎస్)కి చెందిన జాతీయాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో మహిళల ఉపాధి, ఆహార భద్రత సంబంధించి సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. కరోనా మహమ్మారి, లాక్డౌన్తో మహిళలు జీవనోపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను గుప్పించినా పెద్ద సంఖ్యలో మహిళలకు పనులు కల్పించలేదని తెలిపాయి. ఒకే రీతిన రేషన్పై ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ జరగడం లేదని విమర్శించాయి. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అత్యవసర వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశాయి. ఆసుపత్రులకు వచ్చిన గర్భిణులు, చిన్నారులకు వైద్యం నిరాకరించడంతో మృతి చెందిన ఉదంతాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశాయి. లాక్డౌన్ సమయంలో మహిళలపై అరాచకాలు, గృహ హింస కేసులు అధికమయ్యాయని తెలిపాయి. మైక్రో ఫైనాన్స్ సంస్థలు దాడులకు, వేధింపులకు పాల్పడుతున్నాయని విమర్శించాయి. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ప్రతిపాదించాయి. మహిళలను పెద్ద మొత్తంలో సమీకరించాలని, ఆకలితో బాధపడుతున్న, ఆర్థిక అసమానతలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు సాయపడేందుకు అత్యవసర చర్యల అమలుకు కట్టుబడి ఉండాలని జాతీయ మహిళ సంఘాలు నిర్ణయించాయి. అట్టడుగునున్న ప్రజల ప్రభావిత సమస్యలపై విస్తృత పోరాటానికి మహిళలను సమీకరించాలని పునరుద్ఘాటించాయి. రానున్న రోజుల్లో రాష్ట్రాల స్థాయిలో మహిళా సంఘాల ఉమ్మడి సమావేశాలను నిర్వహించాలని తీర్మానం చేశాయి. ఈ నెల 28న ఆందోళనల్లో కార్మికులు, యువకులు, విద్యార్థులు, ఇతర ప్రజాతంత్ర ఉద్యమ సంఘాలు ఉమ్మడిగా పాల్గొనాలని పిలుపునిచ్చాయి.