Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకుడు యూసఫ్ తరిగామి
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇప్పుడక్కడ ప్రజల గోడు వినేనాథుడే లేడు. అధికారం, పాలనాయంత్రాంగమంతా కేంద్రం తన చెప్పుచేతుల్లో పెట్టుకుంది. గత కొద్ది నెలలుగా దేశమంతా లాక్డౌన్ కష్టాలు చవిచూస్తున్నది, కానీ కాశ్మీరీలు ఏడాది కాలంగా కఠినమైన లాక్డౌన్తో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా రని సమాచారం. ఆర్టికల్ 370 రద్దు రాష్ట్రాన్ని కష్టాల కడలిలోకి నెట్టిందని సీపీఐ(ఎం) నాయకుడు యూసఫ్ తరిగామి అన్నారు. రద్దయిన జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా కాశ్మీరీలకు ఆయన సుపరిచితుడు. కాశ్మీరీల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్టికల్ 370తో ప్రజల మనసులు కోలుకోలేనంతగా గాయపడ్డాయని తెలిపారు.
వైరస్ను అడ్డుకోలేకపోయారు...
వైరస్ వస్తోందని తెలుసు. ఎంత ప్రమాదకరమో తెలుసు. అయినా వైద్య ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేయలేకపోయారు. మనదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నదో కరోనా బయటపెట్టింది. దేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయలేకపోయారు. ఏకపక్షంగా లాక్డౌన్ వేసి చేతులు దులుపుకున్నారు. జమ్మూకాశ్మీర్లో కోటీ 25 లక్షలమంది కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజల బాగోగుల్ని కేంద్రం పూర్తిగా విస్మరించింది.
అప్రకటిత కర్ఫ్యూ
ఆర్టికల్ 370 రద్దు అయ్యి..ఏడాది పూర్తయింది. ఈ గాయాన్ని తలుచుకోవడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. ప్రజలపై, ప్రజా ప్రతినిధులపై అప్రకటిత నిర్బంధం కొనసాగుతున్నది. నాగపూర్(ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం)లో ఉండి కాశ్మీర్ వంటి సున్నితమైన సమస్యను పరిష్కరించాలనుకున్నారు. 1947, 1953లలో కాశ్మీర్ విలీనానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పనిచేసింది. దేశంలో మతపరంగా విభజన తీసుకురావటం, దానిని రాజకీయం గా తమకు అనుకూలంగా మలుచుకోవటమనే లక్ష్యంలో భాగంగానే ఆర్టికల్ 370 రద్దు చేపట్టారు. ప్రజా భద్రతా చట్టాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ నాయకుల్ని, జర్నలిస్టుల్ని, పౌరహక్కుల నేతల్ని, మేధావుల్ని అరెస్టు చేస్తున్నారు.
ప్రజా జీవనం అస్తవ్యస్తం
- ఒక అధ్యయనం ప్రకారం, గత ఏడాది కాలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం రూ.40వేల కోట్లు.
- పాలన లేదు. అధికార వ్యవస్థలు లేవు. సమస్యల పరిష్కారానికి ఎక్కడికి పోవాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు.
- పర్యాటకం, చేతివృత్తులు, రవాణాపై ఆధారపడ్డవారంతా దెబ్బతిన్నారు. వారి ఉపాధి పోయింది.
- 4.56లక్షలమంది ఉద్యోగాలు పోయాయి. పరిశ్రమల స్థాపన పేరుతో రైతుల నుంచి 6వేల ఎకరాల్ని ప్రభుత్వం లాక్కుంది.
అభద్రత...అశాంతి
ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడతాయని ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రకటిం చారు. కానీ ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పాక్ సరిహద్దు వెంబడి 2020 జన వరి-జూన్ మధ్యకాలంలో 2300 కాల్పుల ఉల్లంఘనలు జరిగాయి. క్రితం ఏడాది ఇదేకాలంలో 1321 కాల్పుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ఇంటర్నెట్, సమాచార వ్యవస్థను నిలిపేశారు. ప్రజలతో మాట్లాడ కుండా, వారి దగ్గరికి వెళ్లకుండా రాజకీయ నాయకుల్ని నిర్బంధించారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ఆలోచన కేంద్రం చేయటం లేదు. మతాన్ని, ప్రాంతాన్ని(కాశ్మీర్) దేశ రాజకీ యాలకు ఒక ఆయుధంగా వాడుకోవాలన్నదే కేంద్రంలోని పాలకుల ఉద్దేశమని యూసఫ్ తరిగామీ చెబుతున్నారు. ఈ చర్యల ఫలితాలు, పరిణామాలు ముందు ముందు ఊహంచనివిధంగా ఉంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ భారత్లో ఓ భాగం...అని 1956లో రాష్ట్రం చట్టబద్ధంగా తేల్చిచెప్పింది. దీనిపై అక్కడి ప్రజల్లోగానీ, రాజకీయ ప్రతినిధుల్లోగానీ ఎలాంటి అనుమానాల్లేవు. అయితే దీనిని ఆర్ఎస్ఎస్, బీజేపీ వర్గాలు మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో తమ మనుగడకు ఉపయోగపడదన్న వైఖరితో 'ఆర్టికల్ 370'ని వాడుకోవటం మొదలెట్టారు. కేంద్రం జోక్యం పెరగడానికి, కాశ్మీర్లో 7లక్షలమంది సైనికుల్ని మోహరించడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజకీయాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్టికల్ 370 రద్దు (గతేడాది ఆగస్టు 5న)తో కాశ్మీర్ ప్రజల జీవనం మొత్తం తలకిందులైంది. ఆ షాక్ నుంచి ఇప్పటికీ వారు కోలుకోలేదు. భారత ప్రభుత్వం తమను మోసం చేసిందని, ద్రోహం చేసిందని కాశ్మీరీలు భావిస్తున్నారు. అన్ని రకాలుగా ప్రజల కష్టాలు పెరిగాయి. దేశంలో మత రాజకీయాలకు కాశ్మీర్ను బలిపెట్టారు. మతాన్ని, ప్రాంతాన్ని వాడుకుంటున్నారు. కేంద్రం చర్యల వల్ల శాంతిభద్రతలు మరింత దిగజారాయి.
- సీపీఐ(ఎం) నాయకుడు యూసఫ్ తరిగామి