Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల మంది మృతి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఈ వైరస్ ప్రభావం అంతకంతకూ పెంచుకుంటూ మరణ మృదంగం మోగిస్తున్నది. అన్ని దేశాల్లో కలిపి తాజాగా వరల్డో మీటర్ వెల్లడించిన కరోనా గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,87,35,735 మందికి కరోనా సోకింది. అలాగే, 7,05,061 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, గత రెండు వారాల డేటా అధారంగా రోజుకూ సగటున 5,900 మంది వైరస్ కారణంగా మరణిస్తున్నారని రాయిటర్స్ తెలిపింది. ఈ లెక్కన చూస్తే గంటకు 247 మంది.. అంటే 15 సెకన్లకు ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, అమెరికా, బ్రెజిల్, మెక్సికోలలో పాజిటివ్ కేసులతోపాటు మరణాల పెరుగుదల కారణంగానే కరోనా మరణాలు, కేసుల్లో అధిక స్థాయిలో పెరుగుదల చోటుచేసుకుందని తెలిపింది. దాదాపు 640 మిలియన్ల జనాభా కలిగిన లాటిన్ అమెరికాలో వైరస్ వెలుగు చూసిన సమయంలో వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇటీవల అనూహ్యంగా వైరస్ ప్రభావం పెరుగుతున్నదని వివరించింది. కాగా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకూ 49.19 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. 1.60 లక్షల మంది మరణించారు. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో 28.08 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య 96,096కుపెరిగింది.
దేశంలో నిత్యం 50 వేలకు పైగా పాజిటివ్ కేసుల నమోదుతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా ఏడో రోజులుగా 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇదే సమయంలో 857 మంది మరణించారు.