Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సదస్సులో పీఎం మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇటీవల కేంద్రమంత్రివర్గం ఆమోదించిన నూతన ఎడ్యుకేషన్ పాలసీ భారత విద్యారంగం పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. చర్చలు, సమీక్ష తర్వాతే దీన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు. కేంద్ర మానవ వనరుల శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నిర్వహించిన ఉన్నత విద్యా రంగం - పరివర్తక సంస్కరణలు అనే అంశంపై జరిగిన సదస్సులో శుక్రవారం ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ ఫొఖ్రియాల్ నిశాంక్, ప్రముఖ శాస్త్రవేత్తలు సంజరు ధోత్రే, కస్తూరి రంగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... నూతన విద్యావిధానం కొత్త భారత నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు. దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పాటు దీనిపై దేశమంతా చర్చ చేసిందని... చాలావర్గాల ప్రజానీకం నుంచి సలహాలు సూచనలు తమకి అందినట్టు ఆయన వెల్లడించారు. తాము ఆమోదించిన విద్యా విధానం ఒక వర్గ ప్రయోజనానికి ఉపయోగపడేలా లేదని... అన్నివర్గాల ప్రజలకి సముతుల్యంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం మనం 21వ శతాబ్ధంలో ఉన్నామని... విద్యా వ్యవస్థలో సంస్కరణలకి ఇదే సరైన సమయమన్నారు. దీనిపై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే దేశానికి అంత ప్రయోజనం ఉంటుందన్నారు.