Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీిఎం పొలిట్బ్యూరో సంతాపం
తిరువనంతపురం: కేరళలోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. మరింతమంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సంఘటనా స్థలమైన ఇడుక్కిలోని పెట్టిముడికి జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం (ఎన్డిఆర్ఎఫ్), రక్షణ దళానికి చెందిన భద్రతా దళాలు, అటవీ శాఖ అధికారులు, అగ్ని మాపక బృందాలు చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రాంతం జలమయమవ్వడం, అక్కడికి వెళ్లే రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. బాధితులంతా నయమక్కడ్ తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన కార్మికులు. కొంతమంది బంధువుల ఇళ్లకు వచ్చినట్లు సమాచారం. గల్లంతైన వారి జాబితాలో వారు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్నార్ మాజీ పంచాయతీ సభ్యుడు అనంత శివన్తోపాటు ఆయన కుటుంబ సభ్యులు 21 మంది శిధిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వీరంతా నిద్రలో ఉండగానే ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 82 మంది నివసిస్తుండగా, 12 మంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను మున్నార్లోని టాటా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ఇడుక్కి కొండచరియలు విరిగిపడిన ఘటనపై
సీపీఎం పొలిట్బ్యూరో విచారం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొండ చరియలు విరిగిపడి 22 మంది తేయాకు తోట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు చనిపోవడం పై సిపిఎం పొలిట్ బ్యూరో విచారం వ్యక్తం చేసింది. భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న ఈ విపత్తులో అనేక మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది.