Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: కేరళలో కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రమాదంలో మృతి చెందిన 20 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దుబారు నుంచి వస్తున్న విమానం ల్యాండ్ అవుతుండగా, జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లుసహా 20 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించగా, మరో 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కోజికోడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి విజయన్, గవర్నర్ ఆరీఫ్ ఖాన్ శనివారం పరామర్శించారు. ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కోజికోడ్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయన్ మాట్లాడుతూ 23 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారి చికిత్సకయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులను, అధికారులను ప్రశంసించారు. కోవిడ్-19 భయాందోళనలు, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ స్థానికులు ఎంతగానో స్పందించారని, గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు లైన్లలో వేచి ఉన్నారని తెలిపారు. బాధితులను రక్షించేందుకు స్థానికులు ఉరుకులు పరుగులు పెట్టడం, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేయడం, రక్తదానం చేసేందుకు బారులు తీరి ఉండటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటువంటి సంఘటన్నీంటినీ రాష్ట్రంలోనే చూశామని, ప్రతికూల పరిస్థితుల్లో స్థానికులు మానవత్వాన్ని మరోసారి నిరూపించారంటూ విజయన్ అభినందించారు. కోజికోడ్, మలప్పురం ప్రజలను మెచ్చుకునేందుకు ఒక్క క్షణం తీసుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారందరూ కోవిడ్-19 నిబంధనలు పాటించాలనీ, వారందరికీ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుతున్నామని ఆరోగ్య మంత్రి శైలజ ప్రకటించారు. అంతకుముందు ప్రమాద స్థలిని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్, కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, సీఎం విజయన్ సహా పలువురు మంత్రులు సందర్శించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున అందజేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హల్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. 171 మంది కోజికోడ్, మలప్పురం లలో గల 13 ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని వివరించారు. మృతి చెందిన పైలట్ ఇండియన్ ఏయిర్ఫోర్స్ మాజీ టెస్ట్ పైలట్ కెప్టెన్ డి.వి సాతే, కో పైలట్ ఫస్ట్ ఆఫీసర్ అఖిలేష్ కుమార్లుగా గుర్తించారు.
రన్వేతో సంబంధం లేదు : కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి
కోజికోడ్ విమానం దుర్ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ స్పందించారు. కోజికోడ్ ఎయిర్పోర్టులో గల 'టేబుల్ టాప్' రన్వే పరిస్థితిపై వస్తున్న అనుమానాలు, వార్తలను ఆయన తోసిపుచ్చారు. మే 7 నుంచి గత మూడు నెలలుగా వందే భారత్ మిషన్ కింద ఇదే టేబుల్ టాప్ రన్వే పై దాదాపు వంద విమానాలు ల్యాండ్ అయ్యాయని చెప్పారు. '' ఘటనపై ఎయిర్పోర్టు అధికార వర్గాలు ఘటనపై నాకు వివరించాయి. అప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విమానాన్ని ల్యాండ్ చేయడానికి చేసిన మొదటి ప్రయత్న విఫలమైంది. అయితే రెండో ప్రయత్నంలో విమానం లాండ్ కాగానే ఎడమవైపు స్కిడ్ అయి క్రాష్ కావడంతో విమానం ముక్కలైపోయింది'' అని కేంద్ర మంత్రి ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. విమానం ప్రమాద ఘటనకు రన్వే పరిస్థితి సంబంధం లేదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి స్పష్టతనిచ్చారని తెలిపారు. ఏయిర్ఫోర్స్లో సేవలందించిన పైలట్ చాలా అనుభవజ్ఞుడని చెప్పారు.
విమానం నుంచి బ్లాక్బాక్స్ స్వాధీనం :ప్రమాదానికి గురైన ఏయిరిండియా విమానం నుంచి బ్లాక్బాక్స్ను రికవరీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఇందులో ఉండే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్(డీఎఫ్డీఆర్), కాక్పీట్ వాయిస్ రికార్డర్( సీవీఆర్) లలో నిక్షిప్తమైన సమాచారాన్ని నిపుణులు విశ్లేషించను న్నారు. దీంతో ప్రమాదానికి సంబంధించిన ఏదైనా కావాల్సిన ముఖ్యమైన సమాచారం బయటపడే అవకాశం ఉన్నదనీ, ఆ సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన వివరాలూ లభించనున్నాయి. ప్రమాదం వెనుక గల కారణాలను తేల్చడానికి పలు దర్యాప్తులు కొనసాగుతున్నాయని వివరించింది.