Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండో రోజూ కొనసాగిన స్కీమ్ వర్కర్ల ఆందోళన
అమరావతి యంత్రాంగం: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని స్కీమ్ వర్కర్లు రెండో రోజు శనివారం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ సచివాలయాల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సిఐటియు నాయకులు పాల్గొని వీరికి మద్దతు తెలిపారు. సకాలంలో వేతనం చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థల సేవలను ప్రయివేటుపరం చేయడాన్ని ఆపాలని, కనీస వేతనం రూ.21 వేలు, రూ.10 వేలు పెన్షన్, ఇఎస్ఐ, పిఎఫ్ ఇవ్వాలని, ఆదాయపన్ను దిగువన ఉన్న కుటుంబాలకు ఆరు నెలల పాటు ఉచితంగా రేషన్ అందించడంతోపాటు రూ.7,500 ఇవ్వాలని వక్తలు డిమాండ్ చేశారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని, ప్రతి మనిషికీ పది కేజీల ఆహార ధాన్యాలు అందించాలని, పట్టణాల్లోనూ ఉపాధి హామీ చట్టం పనులు కల్పించాలని, కార్మిక చట్టాలను సవరించొద్దంటూ నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. రాజవొమ్మంగి, వై.రామవరం, కడియంలో గ్రామ సచివాలయాల నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద, పలాస మండలం సూదికొండ, తాళభద్ర సచివాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. విశాఖలోని ప్రసాద్ గార్డెన్స్లోగల పట్టణ ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశ వర్కర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం, కాళ్ల, అత్తిలి, పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ, ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, భీమడోలు తదితర మండలాల్లో ఆందోళనలు చేపట్టారు.
ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలరలోని కలవళ్ళ, నలదలపూరు, గరుకుపాలెం గ్రామాల్లో స్కీం వర్కర్లు, యర్రగొండపాలెంలో ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. గుడ్లూరులో అంగన్వాడీలు, కొమరోలు, మార్కాపురం రూరల్లో ఆశా వర్కర్లు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడు, పుత్తూరు, పలమనేరు, చిత్తూరు, బైరెడ్డిపల్లి, నగరి, వి.కోట, చంద్రగిరి, బి.కొత్తకోటలో రెండో రోజు ధర్నాలు నిర్వహించారు.