Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజాగా 61,537 పాజిటివ్ కేసులు
- కరోనాతో 196 మంది వైద్యులు మృతి: ఐఎంఏ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. వరుసగా రెండోరోజు సైతం 60 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం దేశంలో కరోనా ఉధృతికి అద్దం పడుతున్నది. దీనికి తోడు కరోనా మరణాల సంఖ్య సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 61,537 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇదే సమయంలో 933 మంది మరణించారు. దీంతో దేశంలో కోవిడ్-19 మరణాల సంఖ్య 42,518కి పెరిగింది. అలాగే, కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. ప్రస్తుతం 6,19,088 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 14,27,006 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 68.32 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.04 శాతంగా ఉంది. కాగా, దేశంలో మొత్తం 2,33,87,171 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 5,98,778 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. మహారాష్ట్రలో తాజాగా రికార్డు స్థాయిలో 12,822 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్-19 మరణాల సంఖ్య 17,367కు పెరిగింది. అలాగే, వైరస్ బాధితుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటింది.
వర్క్ ఫ్రమ్ హౌం : హర్యానా ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయంలో పనిచేసే గర్భిణీ ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే గర్భిణీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జాయింట్, డిప్యూటీ సెక్రటరీలు, సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, కార్యదర్శులు తమ విభాగాల్లో పనిచేస్తున్న గర్భిణులకు ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
తమిళనాడులో కరోనా కల్లోలం రేపుతున్నది. ఇప్పటివరకూ 27 మంది రాష్ట్ర ఎమ్మెల్యేలకు వైరస్ సోకింది. ఇందులో ఏఐఏడీఎంకేకు చెందిన 11 మంది, డీఎంకే నుంచి 13, ఏఐసీసీ నుంచి ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మహమ్మారి బారినపడ్డారు. కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 4,808 చేరింది.
కరోనాతో 196 మంది డాక్టర్లు బలి
కరోనాతో జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాడుతూ.. ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న వైద్యులు, సిబ్బంది సైతం కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకూ దేశంలో కోవిడ్-19 సోకి 196 మంది వైద్యులు చనిపోయినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శనివారం ప్రకటించింది. కరోనా బారిన పడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదనీ, ప్రతిరోజూ దేశంలో ఏదో ఒకచోట వైద్యులు చనిపోతున్నారని తెలిపింది. వీరిలో అధికంగా జనరల్ వైద్యులు ఉంటున్నారనీ, వైద్యుల రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి ఐఎంఏ లేఖ రాసింది. అన్ని విభాగాల్లో పని చేసే డాక్టర్లతో పాటు వారి కుటుంబాలకు జీవిత బీమా కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
వీరికి కరోనా పరీక్షలు చేయండి: కేంద్రం
కిరాణా షాపులు నిర్వహించే వారు, కూరగాయలు అమ్మేవారు, వీధి వ్యాపారుల నుంచి ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. దాని ద్వారా కరోనా కేసులను ముందుగానే గుర్తించడంతో పాటు మరణాల సంఖ్యను తగ్గించవచ్చునని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ లేఖ రాశారు. అలాగే, కరోనా మరణాల రేటు, పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లోని 13 జిల్లాల అధికార యంత్రాంగంతో రెండు రోజుల పాటు వర్చువల్ సమావేశం నిర్వహించారు. మరణాల రేటు తగ్గించడం, కరోనాకు కళ్లెం వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
మరో కేంద్ర మంత్రికి కరోనా
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇటీవల తనను కలిసిన వారు క్వారెంటైన్లోకి వెళ్లాలనీ, వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.