Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబరు 20 నుంచి పరీక్షలు
- మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలోని పంచాయతీరాజ్ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవ్వాలన్నారు. వారం రోజులపాటు జరగనున్న ఈ పరీక్షలకు సుమారు పది లక్షల మంది హాజరవుతారన్నారు. తొలిరోజు 4.5 లక్షల మంది వరకూ పరీక్షలు రాస్తారన్నారు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించేలా రాష్ట్రంలో సుమారు ఐదు వేల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కువగా ఖాళీలున్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షించామని, ఎటువంటి అవకతవకలకూ చోటు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఎపిపిఎస్పి, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.