Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిడిపి అధినేత చంద్రబాబు
అమరావతి: దళితుల చదువులకు అడ్డుపడటం ఫ్యాక్షనిస్టుల దుష్ట సంస్కృతి అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. దళిత వైద్యులపై అమానుషాలు, దళిత జడ్జిలపై రాళ్ల దాడి, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల భూములు లాక్కోవడం వంటి వైసిపి పాలకుల నీతి మాలిన చర్యలను దళిత సమాజమే నిలదీయాలన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. నిరాహారదీక్ష చేస్తున్న మహేష్కు తక్షణమే న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తును నిర్ధేశించే యువశక్తికి అంతర్జాతీయ యువజనోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగాలను అందుకుని ఉజ్వల చరిత్రను లిఖించాల్సిన యువత భవిష్యత్తుపై భరోసా లేని రూ.ఐదువేల జీతంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండటం బాధాకరమన్నారు. టిడిపి హయాంలో 2014-19 మధ్యకాలంలో 9,56,263 మందికి పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు వచ్చాయని వైసిపి ప్రభుత్వమే చెప్పిందన్నారు. ఐటి రంగంలోనే 30,428 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నిరుద్యోగ భృతి, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి యూనిట్లు మరెన్నో అందించామని చంద్రబాబు పేర్కొన్నారు.