Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాల పిలుపు
అమరావతి: భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను బలహీనపరుస్తూ, అమెరికా ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తూ దేశ స్వతంత్రతకు భంగం కలిగిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్ర ప్రజలకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు (సిపిఎం), కె.రామకృష్ణ (సిపిఐ), జాస్తి కిషోర్బాబు (సిపిఐ ఎంఎల్), కాటం నాగభూషణం (ఎంసిపిఐ యు), పివి సుందరరామరాజు (ఫార్వర్డ్బ్లాక్), జానకిరాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) సంయుక్తంగా బుధవారం ప్రకటన విడుదల చేశారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు సమర్ధమైన చర్యలు తీసుకోకపోగా రాజ్యాంగ మౌలిక సూత్రాలను బలహీనపర్చడం, పార్లమెంటు మొదలు న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, సిబిఐ, ఇడి తదితర రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ వాటి స్వతంత్రతను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం, పౌరస్వేచ్ఛ కోసం ప్రశ్నించేవారిని, ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపిన వారిని జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తోందని విమర్శించారు. అలాంటి ఉద్యమకారులు, మేధావులపై దేశద్రోహం కేసులు బనాయిస్తోందని, రాష్ట్రాల హక్కులను హరించివేస్తోందని పేర్కొన్నారు. స్థూలంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం కల్పించిన, ఇచ్చిన హామీలను, హక్కులను కాపాడుకునేందుకు ప్రజలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. దేశానికి, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలో అమెరికాకు అధీన మిత్ర దేశంగా భారతదేశం మారుతోందని పేర్కొన్నారు. ఇటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని, దేశ స్వతంత్రతను రక్షించు కునేందుకు 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.