Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ధరల ఎఫెక్ట్
- జులైలో తగ్గిన పెట్రోల్ వినిమయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడానికి తోడు అనేక ప్రాంతాల్లో వరదలు రావడంతో దేశీయ ఇంధన డిమాండ్ భారీగా పడిపోయింది. ప్రస్తుత ఏడాది జులై నెలలో పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల డిమాండ్ ఏడాదికేడాదితో పోల్చితే 11.7 శాతం తగ్గి 15.68 మిలియన్ టన్నులుగా నమోదైందనీ చమురు, గ్యాస్ మంత్రిత్వ శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలైసిస్ సెల్ (పీపీఏసీ) వెల్లడించింది. జూన్ మాసంలోని వినిమయంతోనూ పోల్చిన 3.5 శాతం తగ్గుదల చోటు చేసుకోవడం గమనార్హం.
దేశీయ మొత్తం ఇంధన వినియోగంలో ఐదులో రెండో వంతు కలిగిన డీజిల్ వాడకం 19.3 శాతం క్షీణించి 5.52 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఇంతక్రితం జూన్లో ఈ ఇంధన వాడకం 6.31 మిలియన్ టన్నులుగా చోటు చేసుకుంది. గడిచిన నెలలో పెట్రోల్ అమ్మకాలు 10.3 శాతం కోల్పోయి 2.26 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ప్రపంచంలోనే చమురు వినియోగంలో మూడో స్థానంలో ఉన్న భారత్లో అధిక ఇంధన ధరలు అమ్మకాలు, డిమాండ్ను దెబ్బతీశాయి. భారత్లో ఇప్పటి వరకు 20 లక్షల మంది పైగా కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. బ్రెజిల్, అమెరికా తర్వాత అత్యధిక కేసులు భారత్లోనే నమోదవుతున్నాయి.
సమీప భవిష్యత్తులోనూ కరోనా వైరస్కు ముందు పరిస్థితుల నాటికి ఇంధన డిమాండ్ పుంజుకునే అవకాశాలు కానరావడం లేదని దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఏప్రిల్లో ప్రకటించిన లాక్డౌన్ వల్ల రవాణ, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో దేశంలో ఇంధన వినిమయం భారీగా పడిపోయిందని చమురు రంగ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.