Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: ఓ వర్గాన్ని కించపరిచేవిధంగా అభ్యంతరకర వ్యాఖ్యలతో ఫేస్బుక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు పెట్టిన పోస్టు ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈశాన్య బెంగళూరు కావల్ బైరసాండ్రాలోని ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటిని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇంటి పరిసరాల్లోని పూలకుండీలను పగులగొట్టారు. పోలీసులు ముందుగా ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరిపారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు ఎమ్మెల్యే, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ 110 మందిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు సీపీ వెల్లడించారు. సామాజిక మాధ్యమంలో వివాదాస్పద పోస్టు పెట్టిన ఎమ్మెల్యే బంధువు నవీన్ను అరెస్టు చేసినట్టు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని కర్నాటక హౌంమంత్రి బస్వరాజ్ బొమ్మై కోరారు.
ఆలయానికి రక్షణగా ముస్లిం యువకులు..
ఈ ఉద్రిక్తల నేపథ్యంలో పలువురు ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటారు. డీజే హళ్లీలోని ఓ హిందూ ఆలయంపై దుండగులు దాడిచేయకుండా దాని చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ముస్లిం యువకులపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లుకురుస్తున్నది.