Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని రాజకీయపార్టీలు
- పార్లమెంటరీ రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి
- ప్రస్తుత చట్టసభల్లో మహిళల సంఖ్య 103
- ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల్లో వారికి తగిన అవకాశాలివ్వాలి : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ: ఆడవారికి ఆస్తిలో సమానహక్కు కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కానీ దేశ రాజకీయాల్లో మహిళలకు మాత్రం తగిన ప్రాధాన్యత దక్కటంలేదు. మోడీ సర్కార్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా..మహిళా రిజర్వేషన్ బిల్లును ఆటకెక్కించేసింది. భారత్లో ఇంకా పురుషాధిక్యత రాజకీయమే నడుస్తున్నది. మరోవైపు చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెెరగటంపై అనేక దేశాలు దృష్టిసారిస్తున్నాయి. తద్వారా ఆ దేశ చట్టసభల గౌరవం పెరగటమేగాక, చట్టాల రూపకల్పనలో వారి పాత్ర కీలకంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పార్లమెంట్ రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతున్నది. వాటితో పోల్చితే భారత్ చాలా వెనుకబడి ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన పార్లమెంట్లో మహిళా ఎంపీల సంఖ్య చాలా పరిమిత స్థాయిలో (కేవలం 13శాతం) ఉందని వారు గుర్తుచేస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ పెద్ద సంఖ్యలో మహిళలకు అవకాశం ఇవ్వటమొక్కటే దీనికి పరిష్కారమని వారు భావిస్తున్నారు. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఇటీవల ఎన్నికలు ముగిశాయి. తాజా లెక్కల ప్రకారం, 245 స్థానాలున్న రాజ్యసభలో మహిళల సంఖ్య 25కు చేరుకున్నది. సభలో మహిళల ప్రాతినిథ్యం 10శాతం మాత్రమే. ప్రస్తుత 17వ లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య 78. పార్లమెంట్లో మొత్తంగా మహిళల ప్రాతినిథ్యం 103కు చేరుకుంది. గత దశాబ్దకాలంలో జరిగిన వివిధ రకాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు 8-9శాతం మించి మహిళలకు టికెట్లు ఇవ్వలేదు. 1957 నుంచి ఇప్పటివరకూ రాజ్యసభకు 208 మంది మహిళలు ఎంపికయ్యారు. సగటున మహిళల ప్రాతినిథ్యం 9.5శాతం దాటడం లేదు. 2014లో 12.7శాతం నమోదైంది.
గెలుపు రేటులో వారే ముందు
1952 తర్వాత ప్రతి లోక్సభ ఎన్నికల్లో నిలబడ్డ మహిళల్లో అత్యధికమంది గెలుపును అందుకున్నారు. మహిళల గెలుపు రేటు పురుషులతో పోల్చిచూస్తే ఎక్కువగా ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం సమాచారమే చెబుతున్నది. రాజ్యసభకు మహిళల్ని పంపటమన్నది పూర్తిగా ఆయా రాజకీయ పార్టీల అధినాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. ఈనేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల పోరులో మహిళలు నెగ్గుకు రాలేరు అన్న వాదన పస లేదని తేలిపోయింది.
మార్పు ఎప్పుడు!
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, స్వీడన్, జర్మనీ, బ్రిటన్...మొదలైన దేశాల్లో వివిధ రాజకీయ పార్టీలు మహిళలను పెద్ద సంఖ్యలో ఎన్నికలబరిలో దింపుతున్నాయి. తమ ఎన్నికల అభ్యర్థుల్లో 33 నుంచి 50 శాతం వరకు మహిళలు ఉండేట్టు చూసుకుంటున్నాయి. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలు సైతం పార్లమెంట్లో మహిళల స్థానాల్ని రిజర్వ్ చేశాయి. అన్ని రకాల ఎన్నికల్లో మహిళలకు 50శాతం టికెట్లు ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా వివిధ రాజకీయ పార్టీలు హామీ ఇవ్వాలని, అప్పుడే భారత రాజకీయాల్లో మార్పు వస్తుందని, తద్వారా మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుందని పొలిటికల్ పవర్ టు వుమెన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వుమెన్స్ ఆర్గనైజేషన్ ప్రజా సంఘాలు డిమాండ్చేస్తున్నాయి.