Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారి
- తక్షణ చర్యలు అవసరం : ఐఎల్ఓ
న్యూఢిల్లీ : యావత్ ప్రపంచాన్నీ కబళిస్తున్న కోవిడ్-19 అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నది. ఓ పక్క చనిపోయినవారిలో వృద్ధులే అధికంగా ఉన్నారంటూ వార్తలు వస్తుండగా.. మరోవైపు యువకులపై కోవిడ్ కోరలు విప్పుతున్నతీరు మరింత ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచంలోని యువ జనాభాలో సగం మంది మానసికవేదన, ఆందోళనకు లోనవుతున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మూడొంతుల మంది యువత భవిష్యత్ అనిశ్చితిలోకి నెట్టబడుతున్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నిర్వహించిన తాజా అధ్యయనంలో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. అత్యవసర, తక్షణ చర్యలు తీసుకోకపోతే.. యువతపై మహమ్మారి దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదమున్నదని ఐఎల్ఓ హెచ్చరించింది. 'యువకులు - కోవిడ్ 19 : ఉద్యోగాలు, విద్య, హక్కులు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం' పేరులో ఐఎల్ఓ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 'కోవిడ్-19 మహమ్మారి మన జీవితంలోని ప్రతి అంశాన్నీ దెబ్బతీసింది. యువకుల సామాజిక, ఆర్థిక సమైక్యతపై సవాలు విసురుతున్నది. ఇప్పుడు అత్యవసర చర్యలు తీసుకోకపోతే.. యువత తీవ్రంగా నష్టపోయే అవకాశమున్నది. యువతపై మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతుంది' అని నివేదిక పేర్కొంది. ఉపాధి, విద్య, మానసిక ఆరోగ్యం, హక్కులు వంటి అంశాలకు సంబంధించి 18 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారిపై ఈ సర్వే నిర్వహించారు. 112 దేశాల నుంచి 12,000 మందికి పైగా యువకులపై అధ్యయనం చేశారు. విద్య ఆగిపోయిన లేదా ఉపాధి దెబ్బతిన్న యువకుల్లో ఈ మానసిన వేదన, నిరాశ రెట్టింపుగా ఉన్నట్టు పేర్కొంది. 'విద్య, ఉపాధి, మానసిక స్థితిపై సంబంధాన్ని నొక్కి చెబుతున్నదని తెలిపింది. విద్యా సంవత్సరం ఆలస్యం, లేదా వైఫల్యమవుతుందని భావించిన వారిలో 22 శాతం మంది ఆందోళన లేదా డిప్రెషన్కు గురవుతున్నారు. నివేదిక ప్రకారం.. 38శాతం మంది యువకులు తమ భవిష్యత్ ఏమిటో అర్థంకాక, కెరీర్పై అనిశ్చితిలో ఉన్నారు. కోవిడ్ -19 సంక్షోభం ఉపాధికి మరిన్ని అడ్డంకులను సష్టిస్తున్నదని భావిస్తున్నారు.
విస్మయం కలిగిస్తున్నాయి : ఐఎల్ఓ డైరెక్టర్
మహమ్మారి యువతపై చూపుతున్న అంశాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఇది వారి ఉపాధి అవకాశాలను నాశనం చేయడమే కాదు, విద్య, శిక్షణకు విఘాతం కలిగిస్తున్నది. అంతేకాదు యువత మానసిక శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది అని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్ అన్నారు. ప్రతికూల ప్రభావం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వతాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనీ, ఆ దిశగా అన్ని దేశాలు ముందడుగు వేయాలని తెలిపారు.
ప్రతీ ఆరుగురిలో ఒకరిపై...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రెండు కోట్ల మంది వైరస్ బారినపడగా.. 7,40,000 మందికి పైనే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, ఇందులో అనేకమంది యువకులు దీని బారినపడగా, వైరస్ వ్యాప్తి ప్రారంభమైననాటి నుంచి ప్రతీ ఆరుగురిలో ఒకరు ఉపాధికి దూరమవుతున్నట్టు ఐఎల్ఓ సర్వే స్పష్టంచేసింది. యువ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదనీ, వారి ఉపాధి, వృత్తిపరమైన అవకాశాలను దెబ్బతీస్తున్నదని తెలిపింది. ప్రతీ ఆరుగురిలో ఒకరు (17శాతం) ఉపాధి కోల్పోయారనీ, ఇందులో ముఖ్యంగా 18 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు క్లరికల్, సేవలు, అమ్మకాలు, చేతిపనులు సంబంధింత పనుల్లో ఉన్నవారే. ఉద్యోగ యువతలో పని గంటలు సుమారు రోజుకు సగటున రెండు గంటలు పడిపోయాయనీ, ప్రతీ ఐదుగురిలో ఇద్దరికి (42 శాతం) ఆదాయం పడిపోయింది.