Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021 నాటికి 10 కోట్లకు చేరనున్న మహిళలు..
- భారత్లో కోవిడ్ తెచ్చిన దారుణ పరిస్థితులు : ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా భారత్లో మహిళలు, బాలికలు తీవ్ర దారిద్య్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2021 నాటికి ఈ సంఖ్య దాదాపు 10 కోట్ల వరకు చేరే అవకాశం ఉన్నదని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ ఏడాదిలో కటిక పేదరికాన్ని ఎదుర్కొంటున్న మహిళలు, బాలికల సంఖ్య దేశంలో 8.7కోట్లుగా ఉన్నట్టు అంచనా. ఈ మేరకు యూఎన్ వుమెన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) ఇటీవల తాజా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో కరోనా మహమ్మారికి ముందు మహిళల్లో పేదరికం రేటు 13.3శాతంగా ఉన్నది. ఇది పురుషుల్లో మాత్రం 12.1శాతంగా ఉన్నది. అయితే 2021 నాటికి 14.7శాతం మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి వెళ్లనున్నారు. ఇదే సమయం నాటికి 13.7శాతం పురుషులు ఈ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నది. భారత్లో ఈ ఏడాదిలో 25 ఏండ్ల నుంచి 35 ఏండ్ల మధ్య ఉన్న మహిళల పేదరికం రేటు 12శాతంగా ఉన్నట్టు ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. అంటే ఈ ఏజ్ గ్రూపులో దాదాపు 1.34 కోట్ల మంది మహిళలు దారుణమైన పేదరిక పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అయితే, 2021 నాటికి పేదరికం రేటు 14శాతానికి చేరొచ్చని అంచనా. అంటే దాదాపు 1.52 కోట్ల మంది మహిళలు తీవ్ర దారిద్య్రంలోకి వెళ్లే ప్రమాదం ఉన్నది. ఈ అంచనా లెక్కల ప్రకారం.. 2021లో ప్రతి 100 మంది పురుషులకు గానూ 120 మంది మహిళలు అసాధారణ పేదరికంలోకి పడిపోతారు. 2030 నాటికి ఇది 100:129 గా నమోదయ్యే అవకాశాలున్నాయని నివేదిక హెచ్చరించింది. అయితే, ఈ ఏజ్ గ్రూపులోని వారిలో లింగ పేదరిక అంతరాన్ని తగ్గించేందుకు భారత్కు మరో 37 ఏండ్ల సమయం పట్టవచ్చని వివరించింది.
అయితే ఇప్పటికే అసంఘటిత రంగంలోని మహిళా కార్మికులు ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మోడీ సర్కారువిధించిన ఏకపక్ష లాక్డౌన్ కారణంగా వారు తమ వేతనాలను కూడా అందుకోలేక ఉపాధికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక దేశంలోని మహిళలకు ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నది. అయితే, మోడీ సర్కారు ఇకనైనా కండ్లు తెరిచి ఆలయాలు, కార్పొరేట్ల ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధను మహిళలకు ఉపాధి కల్పించడంలో చూపితే బాగుంటుందని మహిళా, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని సగటు పౌరుడికి ఉపాధిని కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తున్నారు.