Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో 80వేలు దాటిన మృతుల సంఖ్య
- సెప్టెంబర్ మరణాలు ప్రపంచంలోనే ఎక్కువ
- ఈ నెలలో చనిపోయినవారు 15 వేల మందికి పైగానే..
న్యూఢిల్లీ : భారత్లో కోరలు చాచిన కరోనా మరణమృదంగం మోగిస్తున్నది. దేశంలో వైరస్ బాధితులను బలితీసుకుంటున్న మహమ్మారి ప్రజలను హడలెత్తిస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసి ప్రజలను కాపాడాల్సిన మోడీ సర్కారు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నది. దీంతో వేలాది మంది భారతీయుల ప్రాణాలు తీసుకుంటున్న కరోనా దేశాన్ని కకావికలం చేస్తున్నది. భారత్లో కరోనా మరణాలు సోమవారం నాటికి 80వేల మార్కును దాటాయి. గత పదిహేను రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్లోనే అత్యధిక మరణాలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. దేశంలో రికార్డయిన చివరి 20వేల కరోనా మరణాలు కేవలం 19 రోజుల్లోనే సంభవించడం ఆందోళనకరం. అంటే రోజుకు సగటున దాదాపు 1000 మరణాలు చోటుచేసుకున్నాయన్న మాట. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1070 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో భారత్లో కరోనా మృతుల సంఖ్య 80,737కు చేరుకున్నదని ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం తెలియజేస్తున్నది. సెప్టెంబర్ నెలలో గత 14 రోజులుగా రోజువారీ మరణాలు వెయ్యికి తక్కువగానే నమోదవుతున్నాయి. ఈనెల 6నే అత్యధికంగా 994గా రికార్డయ్యింది. కాగా, ఈనెలలో ఇప్పటి వరకు(సోమవారం వరకు) కరోనాతో 15,364 మంది ప్రాణాలు విడిచారు. అయితే సెప్టెంబర్ నెలలో సంభవించిన మరణాలే ప్రపంచలో అత్యధికమని కరోనా లెక్కలను బట్టి తెలుస్తున్నది.
ఆదివారం ఎఫెక్ట్.. సోమవారం తగ్గుతున్న కేసుల సంఖ్య
ఇక కరోనా కేసులు మాత్రం కిందటి రోజుతో పోల్చితే మాత్రం సోమవారం 94వేల నుంచి 80,663కు తగ్గడం గమనార్హం. అయితే ఆదివారం సిబ్బంది కొరత కారణంగా కరోనా టెస్టులు తక్కువగా ఉండటంతో ప్రతి సోమవారమూ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. ఇక 38,49,152 రికవరీ కేసులతో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నది. ఇక కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఒడిషా(4,198 కేసులు), మధ్యప్రదేశ్ (2,483 కేసులు), రాజస్థాన్(1730) రాష్ట్రాలలో సోమవారం తక్కువ కేసులు నమోదుకావడం దేశంలో రికార్డయిన తాజా కేసుల సంఖ్య తగ్గిపోయింది.
మహారాష్ట్రలో రష్యా కంటే ఎక్కువ కేసులు
దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర వణికిపోతోంది. గత ఐదురోజుల్లో ఇక్కడ 22వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే సోమవారం మాత్రం ఆ సంఖ్య 17,066గా ఉన్నది. ఇక మొత్తానికి ఆ రాష్ట్రంలో కరోనా కేసులు 10,77,374కు చేరుకున్నాయి. ఈ సంఖ్య అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉన్న రష్యా కంటే అధికం కావడం గమనార్హం. దాదాపు 50 లక్షల కరోనా కేసులతో భారత్ ఇప్పటికే ప్రపంచంలో రెండో స్థానంలో.. మరణాల్లో మూడో స్థానంలో ఉన్నది.