Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన గుల్ఫిషా ఫాతిమా ఆవేదన
న్యూఢిల్లీ : జైళ్లో తనను అధికారులు వేధిస్తున్నారని ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన విద్యార్థి గుల్ఫిషా ఫాతిమా అన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైళ్లో ఉంటున్నారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా.. ఆమె జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైలు అధికారులు, సిబ్బంది తనను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచీ తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'వాళ్లు నన్ను చదువుకున్న తీవ్రవాది అంటూ హేళన చేస్తున్నారు. నా మీద మతతత్వ వేధింపులకు పాల్పడుతున్నారు. నేనిక్కడ నరకం అనుభవిస్తున్నాను. ఇవి భరించలేని పక్షంలో నేనేమైనా చేసుకుంటే మాత్రం దానికి జైలు అధికారులదే బాధ్యత' అని న్యాయమూర్తితో తన ఆవేదన వెలిబుచ్చారు. ఆమె వాదనలు విన్న తర్వాత అడిషినల్ సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ స్పందిస్తూ.. దీనికి సంబంధించి కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని ఫాతిమా తరఫు న్యాయవాదికి సూచించారు.