Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిన్ని చర్చలు అవసరం : రక్షణ శాఖ వర్గాలు
న్యూఢిల్లీ : భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నివారణే లక్ష్యంగా జరిగిన 6వ విడత సైనిక కమాండర్ స్థాయి చర్చలు కొంతమేర సానుకూలంగా జరిగినట్టు రక్షణశాఖ వర్గాలు మంగళవారం తెలిపాయి. అయితే లడఖ్లోని సరిహద్దు వెంబడి ఇరువురి మధ్య బలగాల ఉపసంహరణ, ఇతర అంశాలకు సంబంధించి అవగాహనలేమీ కుదరలేదని పేర్కొన్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఆరో విడత చర్చలు రాత్రి 11 గంటల వరకూ 14 గంటల పాటు కొనసాగాయి. మొదటిసారిగా విదేశాంగ శాఖకు చెందిన అదనపు కార్యదర్శి ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యలు క్లిష్టమైనవి కావడంతో పాటు భిన్న అభిప్రాయాలు ఉన్నందున పరిష్కారానికి మరికొన్ని విడతల చర్చలు జరగాల్సిన అవసరం ఉందని రక్షణశాఖకు చెందిన అధికారులు పేర్కొన్నారు.
సరిహద్దు ఉద్రిక్తలను నివారించేందుకు ఇరుదేశాలకు చెందని రక్షణ శాఖ మంత్రులు ఇటీవల రష్యాలో జరిగిన షాంఘై సహకార కూటమి(ఎస్సీఓ) సమావేశాల సందర్భంగా ఐదు అంశాలతో కూడిన ఒక ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే తాజాగా సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో వచ్చిన చర్చల సారాంశాన్ని ప్రభుత్వం అంతర్గతంగా చర్చించి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అన్ని వివాదాస్పద పాయింట్లతో పాటు వాస్తవధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉన్న బలగాలను వెనక్కు తీసుకునేందుకు రోడ్మ్యాప్ ప్రకటించాలని ఈ భేటీలో భారత్ చైనాపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు.